Friday, April 19, 2024

సింగరేణి తోనే బెల్లంపల్లి అభివృద్ధి: మంత్రి హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

బెల్లంపల్లి: రాష్ట్రంలోని ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ ఆరోగ్యకర తెలంగాణను నిర్మించడమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష్యంగా పని చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం బెల్లంపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో రూ.17 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆసుప్రతి , డయాలసీస్ కేంద్రాన్ని ఆయన వ్యవసాయ శాఖ, దేవాదాయ శాఖ మంత్రులు సింగిడి నిరంజన్ రెడ్డి,అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు.అ నంతరం స్థానిక ఏఎంసీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల కాలంలో గ్రామీణులు వైద్యం కోసం నానా తంటాలు పడుతూ ప్రాణాలు వదిలిన ఘనత గత ప్రభుత్వాలు సొంతం చేసుకున్నాయన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైద్యానికి ప్రభుత్వం పెద్దపీఠ వేసి మారుమూల గ్రామీణులకు సైతం కార్పోరేట్ వైద్యసేవలు అందించేందుకు సరికొత్త సాంకేతిక పరికరాలతో ప్రభుత్వ ఆసుప్రతులను నిర్మించడం జరిగిందని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో 17 నూతన వైద్య కళాశాలలు నిర్మించడం జరిగిందన్నారు. సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా రామగుండంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో అతి తక్కువగా లాభాలు పొందిన సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం లాభా వాటా ఇప్పించి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. మెడికల్ అన్‌ఫిట్ ద్వారా దాదాపు 16 వేల మంది యువకులకు సింగరేణి ఉద్యోగాలు మంజూరు కార్మికుల ఇళ్లల్లో వెలుగులు నింపడం జరిగిందని తెలిపారు. సింగరేణి తోనే బెల్లంపల్లి అభివృద్ధి చెందిందని , రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి సాధించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ప్రభుత్వ ఆసుప్రతిలో సరిపడా సిబ్బంది,సాంకేతిక పరికరాలు ,వసతులు కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సొంత భవనాలు , పల్లె దవఖానాలు నిర్మాణాలకు కృషి చేస్తూ , గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తానన్నారు. అనంతరం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటి నూతన కమిటి ని ప్రమాణస్వీకారం చేయించారు.వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతు భీమా పథకాలు ఎంతాగానో దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.ప్రతీ ఏటా లక్షల మంది రైతులకు రైతుబంధు అందించి ఆర్థిక అభివృద్ధికి కెసిఆర్ ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.వ్యవసాయం పై రెండు కోట్ల మంది ప్రత్యేక్షంగా ,పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని సూచించారు.బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అభ్యర్థన మేరకు బెల్లంపల్లిలో నూతన మామిడి మార్కెట్ , వ్యవసాయ కళాశాల ఏర్పాటు కు హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల పై ఇతర రాష్ట్రాలు హర్షం వ్యక్తం వాటిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు సన్నాహాలు చేయడం కెసిఆర్ గొప్పతనమని కొనియాడారు.

దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో బెల్లంపల్లికి ప్రాణహిత సాగు నీరు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.నూతన ప్రభుత్వ ఆసుప్రతిని గ్రామీణులు ఉపయోగించుకోవాలని సూచించారు.అనంతరం బెల్లంపల్లి లోని పలు మహిళా సంఘాలకు మంజూరైన చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, జెడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, బెల్లంపల్లి ఎంఎల్ఎ దుర్గం చిన్నయ్య, ఎంఎల్ సి దండె విఠల్ , మంచిర్యాల ఎంఎల్ఎ నడిపెల్లి దివాకర్ రావు ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు , మాజీ ఎంఎల్ సి పురాణాం సతీష్, కలెక్లర్ భారతీ హోళ్లికేరి , ట్రైనీ కలెక్టర్ గౌతమి, జెడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ ,బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ జక్కుల శ్వేత,వైస్ చైర్మన్ సుదర్శన్ ,లక్షేటిపేట్ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య ,

ఏఎంసీ చైర్మన్ బోనగిరి నిరంజన్ గుప్తా , డీఆర్‌డీవో శేషాద్రి , ఆర్డీవో శ్యామలా దేవి ,డిఎం అండ్ హెచ్‌వో సుబ్బారాయుడు ,అరవింద్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో విజయపూర్ణిమ ,ప్రజాప్రతినిధులు , అధికారులు , నాయకులు , వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News