Friday, April 19, 2024

సొంత రాబడుల వృద్ధిలో మనమే నెంబర్ 1

- Advertisement -
- Advertisement -

సొంత రాబడుల వృద్ధిరేటులో తెలంగాణ మొదటిస్థానం
పారదర్శకత పాలనతోనే ఈ తరహా వృద్ధిరేటు సాధ్యం
2022, 23లో రూ.72,564 కోట్ల పన్నుల వసూలుతో
లక్ష్యాన్ని సాధించి వాణిజ్య పన్నుల శాఖ చరిత్ర సృష్టించింది
తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది
వాణిజ్య పన్నుల శాఖ మేథోమధన సదస్సులో మంత్రి హరీష్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్: సొంత రాబడుల వృద్ధిరేటులో గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. పారదర్శకత పాలనతోనే ఈ తరహా వృద్ధిరేటు సాధ్యమవుతోందన్నారు. హైదరాబాద్ శివారులోని గోల్కొండ రిసార్ట్ లో జరిగిన వాణిజ్య పన్నుల శాఖ మేథోమధన సదస్సుకు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శాంతికుమారి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్, అధికారులు, ఉద్యోగులు పాల్గొ న్నారు. ఆదాయ వనరులు పెంపుదలపై ఈ సదస్సులో చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2022,-23లో రూ.72,564 కోట్ల పన్నుల వసూలుతో లక్ష్యాన్ని సాధించి చరిత్ర సృష్టించిందని హరీశ్ రావు అన్నారు. ఇందుకు కృషి చేసిన అధికారులను ఆయన అభినందించారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇందుకోసం ఖర్చు చేయాల్సిన ధనాన్ని సమీకరించడంలో వాణిజ్య పన్నుల శాఖదే పెద్ద చేయి అని తెలిపారు.

2023, 24లో రూ.85.413 కోట్లు లక్ష్యంగా ముందుకు
2023, 24లో రూ.85.413 కోట్లు లక్ష్యంగా నిర్ధేశించినట్లు మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ లక్ష్యాన్ని వాణిజ్యపన్నుల శాఖ ఎలా చేరుకుంటుందన్న అంశంపైనే ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆధారపడి ఉంటాయన్నారు. సమీకరించే ప్రతి రూపాయి సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం వినియోగిస్తున్నారన్న విషయాన్ని ఎప్పటికీ మరువకూడదని మంత్రి సూచించారు. ఉద్యోగులు కష్టపడి పని చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
సిఎం అనేక సదస్సుల్లో సందర్భాల్లో ఈ శాఖ ఉద్యోగుల పనితీరుని అభినందించారన్నారు. ఉద్యోగులందరూ ఇలాగే సమర్థవంతంగా కష్టపడి రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు. తెలంగాణ ఆచరిస్తుంది… దేశం అనుసరిస్తుందని గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఇంకా పెంచి దేశంలోనే తెలంగాణను అభివృద్ధికి సూచికగా నిలబెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

స్ట్రీట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ రేట్‌లో తెలంగాణ నెంబర్‌వన్
తెలంగాణలో జరుగుతున్న అనేక సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మిషన్ భగీరథ పథకం, రైతుబంధు, మూగ జీవులకు అంబులెన్స్, జిల్లాకు మెడికల్ కాలేజీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. జీఎస్టీ సమావేశాల్లో మన రాష్ట్ర పనితీరు అన్ని రాష్ట్రాల కంటే ఎంతో మెరుగ్గా ఉందన్నారు. ఈ 8 సంవత్సరాల్లో స్ట్రీట్ ఓన్ రెవెన్యూ గ్రోత్ రేట్‌లో భారతదేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. పారదర్శక పరిపాలన అందించినప్పుడే ఇలాంటి రెవెన్యూ గ్రోత్ రేట్ సాధ్యమవుతుందన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెస్ తీసుకోని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ జీరో సెస్ టేకింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని మంత్రి అభివర్ణించారు.

2022 సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 2,65,942
రాష్ట్రంలో కమర్షియల్ ట్యాక్స్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. రాష్ట్రం సాధించిన ఆర్థికవృద్ధికి మరో కొలమానంగా నిలిచిందన్నారు. తలసరి ఆదాయం 2014 సంవత్సరంలో రూ.1,12,162 కాగా, 2022 సంవత్సరంలో రూ.2,65,942 నమోదయ్యిందన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయ వృద్ధిరేట్‌లో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్ర పరిపాలనలో తెలంగాణ అభివృద్ధి కుంటుపడిందన్నారు. గత పాలకులు అభివృద్ధి అంటే ఐటి లేదా సంక్షేమం లేదా వ్యవసాయం అంటూ కేవలం ఒక రంగాన్ని పట్టుకొని ఉండేవారన్నారు. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయాన్ని, సంక్షేమాన్ని, ఐటితో పాటు అన్ని రంగాల్ని కలిపి తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారన్నారు.

158 మంది ఆఫీసర్లు.. 6 టీంలు
దేశ, విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా మంచి ప్రాక్టీస్ ఉంటే దానిని మనం అనుసరించవచ్చని, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే ఏ విషయమైనా మనం నేర్చుకొని, మన రాష్ట్రానికి ఉపయోగపడేలా మనం కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ మేథోమధన సదస్సును నిర్వహిస్తున్న చీఫ్ సెక్రటరీ, కమిషనర్‌లకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న 158 మంది ఆఫీసర్లు 6 టీంలుగా ఏర్పడి, విభిన్న రంగాల్లో పన్ను ఏ విధంగా ఎగవేతకు గురవుతుందో వెలికి తీయడానికి తమ అనుభవాన్ని ఆలోచనలను, చట్టంలో ఉన్న సూక్ష్మాలను రంగరించి ఒక ప్రణాళికను తయారుచేశారని మంత్రి తెలిపారు. ఈ ప్రయోగం వల్ల రాష్ట్రానికి ఎంతో అవసరమైన ఆదాయాన్ని సమీకరించవచ్చని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News