అల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి భారీగా వరద నీటిని విడుదల చేయాలని కృష్ణ బోర్డుకు కేంద్రం హెచ్చరిక, అప్రమత్తమైన అధికారులు, ఎగువన మహారాష్ట్ర, కర్నాటకల్లో కుండపోత వానలు
శ్రీశైలం ప్రాజెక్టుకు పోటెత్తనున్న వరద నీరు
మన తెలంగాణ నాగర్కర్నూల్ ప్రతినిధి: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కేంద్ర జలసంఘం కృష్ణా నది యాజమాన్య బోర్డుకు హెచ్చరికలు జారీ చేసింది. ఎగువ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదికి భారీ వరద పొటెత్తే అవకాశాలు ఉన్నట్లు గుర్తించి కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల అధికారులను అప్రమత్తం చేసింది. ప్రధానంగా ఇప్పటికే కర్ణాటకలోని అలమట్టి, నారాయణపూర్ డ్యాంలలో గరిష్ట స్థాయిలో నీరు ఉండడంతో ఎగువ నుంచి వచ్చే వరద ఆధారంగా దిగువకు ముందస్తుగా నీటిని వదిలిపెట్టాలని అలమట్టి, నారాయణపూర్ డ్యాం అధికారులకు సూచించినట్లు సమాచారం. కేంద్ర జలసంఘం ఆదేశాలకనుగుణంగా కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల అధికారులు అప్రమత్తమయ్యా రు. అందుకు అనుగుణంగానే గురువారం 40వేల క్యూసెక్కుల వరద పెరగడంతో ప్రస్తుత ం అలమట్టికి 57వేల 25క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వచ్చి చేరుతుంది.
బుధవారం వరకు 10 వేల క్యూసెక్కులకే పరిమితమైన వరద భారీ వర్షాలతో పెరిగింది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే రెండు మూడు రోజుల్లో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర జలసంఘం సూచనల తో జూరాల ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాలలో 5యూనిట్ల ద్వారా భారీ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ శ్రీశైలంకు 30వేల 817 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అదే విధంగా శ్రీశైలం జలాశయంలో 885 అడుగులకు గాను 848.60 అడుగుల మేర నీరు ఉన్నాయి. తెలంగాణకు చెందిన శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 38వేల 140 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 19.488 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి నీటిని దిగువ నాగార్జున సాగర్కు వదులుతున్నారు. జూరాల జలాశయంలో 4.226టిఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాలకు ఎగువ నారాయణపూర్ నుంచి 12వేల క్యూసెక్కుల వరద గురువారం సాయంత్రానికి నమోదయ్యింది. నెట్టెంపాడు, కోయిల్సాగర్, జూరాల కుడి ఎడమ, సమాంతర కాలువల ద్వారా 24వేల 52క్యూసెక్కుల నీటని సాగు నీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. విద్యుత్, సాగునీటి అవసరాల కోసం మొత్తం 33వేల 330 క్యూసెక్కుల నీటిని జూరాల ద్వారా వినియోగిస్తున్నారు.
శ్రీశైలం తిరుగుజలాలపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన హాంద్రీనీవా సుజలస్రావంతి ఎత్తిపోతల ద్వారా 1350క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 1650క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్ అవసరాలకు 42వేల 320 క్యూసెక్కుల చొప్పున మొత్తం 45వేల 471క్యూసెక్కుల ఔట్ఫ్లో నమోదయ్యింది. తుంగభద్ర నదికి 17వేల 858 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. కర్ణాటకలోని తుంగ జలాశయం 21గేట్లను ఎత్తి 56వేల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. రెండు రోజుల్లో ఈ వరద నీరు తుంగభద్ర జలాశయానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫ్లో ఇలాగే కొనసాగితే తుంగభద్ర మరో వారం రోజుల్లో నిండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్రలో పూర్తి స్థాయిలో నీరు చేరితే శ్రీశైలం జలాశయానికి భారీ వరద వచ్చే అవకాశాలు నిండుగా ఉన్నాయి.
Heavy flood water inflow into Srisailam Project