ఐదు గేట్లు ఎత్తి 29 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులు
హైదరాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కడెం ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి 29వేల775 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేసారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు (7.603 టి యం సి లు) కాగా ప్రస్తుత నీటి మట్టం 696 అడుగులు ( 6.665 టి యం సి లు)గా వుంది భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వరదనీరు 30 వేల క్యూసెక్కులు రావడంతో అప్రమత్తమైన నీటి పారుదల శాఖ అధికారులు 5 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసారు. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరడంతో ఉమ్మడి జిల్లా నుండే కాకుండా ఇతర జిల్లాల నుండి పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలను తిలకించడంతో ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి పెరిగింది.