Saturday, April 20, 2024

ప్రళయ వాన

- Advertisement -
- Advertisement -

ఒకటే వర్షాలు.. గుండెల్లో రైళ్లు

జలదిగ్భందంలో నిర్మల్ పట్టణం, భైంసా పలు జిల్లాలో పొంగిపొర్లుతున్న వాగులు, చెరువులు
హైదరాబాద్‌లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం
రంగంలోకి డిఆర్‌ఎఫ్ బృందాలు కడ్తాల్ జాతీయ రహదారి 44పై భారీగా నిలిచిపోయిన వరదనీరు
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్
మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసిన వాతావరణ శాఖ
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 273.3 మి.మీ వర్షం, రాష్ట్ర వ్యాప్తంగా 20ప్రాంతాల్లో 136మి.మీ ఆగిపోయిన బొగ్గు ఉత్పత్తి

ఊర్లన్నీ చెరువులమయం అవుతున్నాయి. ఒర్రెలు, రేవులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వీధులు, నదులు, రోడ్లు సముద్రాలయ్యాయి. ఇళ్లు సగానికి మునిగిపోయాయి. వరద నట్టింట కాపురం చేస్తోంది. పొంగుతున్న వాగుల్లో చిక్కుకుపోయిన జనాన్ని పోలీసులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేరుస్తున్నారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాల పడవలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. నిర్మల్ రోడ్లపై చేపలు పట్టుకునేందుకు జనం పరుగులు తీస్తున్నారు. వరుసగా రోజుల తరబడి
కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలు జలగర్భంలో కూరుకుపోయి అతలాకు తలమవుతున్నాయి. అన్ని చోట్ల తగిన సహాయ చర్యలు తీసుకోవాలని ఒక్క ప్రాణ నష్టం జరగకుండా చూడాలని
సిఎం కెసిఆర్ ప్రత్యేక సమీక్ష సమావేశం నుంచి అధికారులను ఆదేశించారు.

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. విరామం లేకుండాకు రుస్తున్న వానలకు గ్రామాలు, పట్టణాలు జలమయమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. నిర్మల్, భైంసా ఇప్పటికే జలదిగ్భందంలో చిక్కుకోగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు అధికారులు అక్కడ పర్యటించి పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను రాష్ట్ర ప్రభుత్వం అక్కడకు పంపించింది. ఇక్కడ కురుస్తున్న వర్షాలకు కడ్తాల్ జాతీయ రహదారి 44 రో డ్డుపై భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో హైదరాబాద్ టు నాగపూర్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను, మ హబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. రాబోయే మూడు రోజులపాటు అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఉరుములు మెరుపులతో పాటు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
అందుబాటులో కంట్రోల్‌రూం
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలు జలమయ మవుతున్నాయి. మూడు రోజులుగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా అధికారుల ముందస్తు చర్యల్లో భాగంగా పలు ప్రధాన కూడళ్ల వద్ద డిఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. జిహెచ్‌ఎంసీ సిబ్బంది నాళాలపై ఉన్న చెత్తను తీసివేస్తున్నారు. భారీ వర్షపాతం నమోదైతే వెంటనే స్పందించేందుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. భారీగా పోటెత్తుతున్న వరదతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
బలపడిన అల్పపీడనం
గురువారం ఉదయం వాయువ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి సగటున 7.6 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ నైరుతి దిశగా వంపు తిరిగి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని, అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తున ఈ ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్‌కర్నూలు, జగిత్యాల, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ గ్రామీణం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌గర్, వికారాబాద్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా కురువనున్నట్టు అధికారులు తెలిపారు. ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం వివరాలు ఇలా….
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 273.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జగిత్యాల జిల్లాలో 200, నిర్మల్‌లో 172.8, నిజామాబాద్‌లో 157.8, వరంగల్ రూరల్‌లో 137, మేడ్చల్ మల్కాజిగిరిలో 40, రంగారెడ్డిలో 38, హైదరాబాద్‌లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా రాష్ట్రంలోని 20కి పైగా ప్రాంతాల్లో 10 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది.

Heavy floods in Nirmal and Bhainsa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News