72 గంటల పాటు అప్రమత్తంగా ఉండండి
అధికారులకు బల్దియా బాస్ ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : భారీవర్షాల నేపథ్యంలో రాబోయే 72 గంటలపాటు అధికారులు అప్రమత్తంగ ఉండాలని బల్దియా కమిషనర్ లోకేష్కుమార్ ఆదేశించారు. వాతావరణశాఖ జారీచేసిన అంచనాల ప్రకారం సోమవారం నుంచి 15వ తేదీవరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, అధికారులు తమ పరిధిలోని క్షేత్రస్థాయి మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి అందుబాటులో ఉంచాలని సూచించారు. కొన్నిప్రాంతాల్లో 9 సెంమీ నుంచి 16 సెంమీల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని, అతిభారీ వర్షాల వల్ల ఏర్పడే వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండలన్నారు. అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో రిలీఫ్ సెంటర్లుగా గుర్తించిన పాఠశాలల్లో, కమ్యూనిటీ హాల్స్, ఇతర వసతులను సిద్దంగా ఉంచాలని సూచించారు.బల్దియా అధికారులందరూ అందుబాటులో ఉండాలని కమిషనర్ లోకేష్కుమార్ ఆదేశించారు. అంతకుముందు నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలకు నోటీసులు అందజేసి, వారిని ఖాళీ చేయించాలని మంత్రి కెటిఆర్ బల్దియా అధికారులను ఆదేశించారు.