Thursday, April 25, 2024

గుజరాత్‌లో భారీ వర్షాలు… లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు

- Advertisement -
- Advertisement -

గాంధీనగర్ : భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం అవుతోంది. మరికొన్ని రోజులు రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాల కారణంగా రాజ్‌కోట్,సూరత్, గిరిసోమనాథ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకుపోయాయి. మంగళవారం పలుచోట్ల 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దాంతో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు అధికారులు తరలించారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ గణాంకాల ప్రకారం గిర్‌సోమనాథ్ జిల్లా లోని సూత్రపాడ తాలూకాలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

ప్రస్తుతం జలదిగ్బంధానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు, ఇతర వాహనాలు నీటిలో తేలియాడుతున్న వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వరదల కారణంగా దుకాణాలు మూసివేశారు. గిర్ సోమనాథ్ లోని ఓ ప్రాంతంలో మొసలి జనావాసం లోకి ప్రవేశించిన దృశ్యాలు వెలుగు లోకి వచ్చాయి. వరద నీటిప్రవాహం ఎక్కువగా ఉండడంతో 43 రిజర్వాయర్లకు హై అలర్ట్ ప్రకటించినట్టు గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. మరో 19 రిజర్వాయర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్‌ఎఫ్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సెస్ ను అధికారులు సిద్ధంగా ఉంచారు. గత నెల గుజరాత్‌ను బిపోర్‌జాయ్ తుపాను వణికించిన సంగతి తెలిసిందే. దాని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భీకర గాలులు, కుండపోతగా వర్షాలు కురిశాయి. ఆ సమయంలో ఆలయాలు, పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News