హైదరాబాద్: తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై గురువారం హైకోర్టులో విచారణ చేపట్టింది. సిఎస్ సోమేష్కుమార్ విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రిపగలు కష్టపడుతున్నారని సిఎస్ తెలిపారు. ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా యాంటిజెన్ పరీక్షలు జరుగున్నాయి.
రాష్ట్రంలో రోజుకు 40వేల ర్యాపిడ్ పరీక్షలు జరిపేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. జిహెచ్ఎంసిలో కరోనా తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలన్నింటీకి ఆక్సిజన్ సదుపాయం కల్పించాం. హితం యాప్ ను ఇప్పటివరకు 45వేల మంది వినియోగిస్తున్నారు. హైకోర్టు సూచనల మేరకు తెలుగులో కూడా బులెటెన్ ఇచ్చాం. ప్రైవేట్ ఆస్పత్రులపై నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి విచారణ జరుపుతున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. కరోనా కేర్ కేంద్రాల వివరాలు వెల్లడిస్తామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ రద్దు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు 50 మందికి నోటీసులు ఇచ్చామని సోమేశ్ కుమార్ కోర్టుకు తెలిపారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణ యోధులు తమ వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని తెలంగాణ హైకోర్టు కోరింది. అధికారుల నైతిక స్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వాన్ని, అధికార యంత్రాంగాన్ని మిమర్శించాలనేది మా ఉద్దేశం కాదని తెలిపింది. కరోనా నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం చాలా కష్టపడుతోందన్న కోర్టు చిన్న చిన్న లోపాలను సరిదిద్దాలనేదే మా ప్రయత్నమని స్పష్టం చేసింది. దేశంలో అత్యత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రయత్నమని హైకోర్టు సూచించింది. కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోంది. సుమారు 99శాతం పర్ ఫెక్షన్ వచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది.