Saturday, April 20, 2024

ఎంఎల్‌ఎలకు ఎర కేసు.. బిజెపికి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ లక్ష్మీజనార్దన సంతోష్)కు ఇచ్చిన సిట్ నోటీసులను రద్దు చేయాలన్న బిజెపి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. బిఎల్ సంతోష్ పోలీసుల విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే తదుపరి ఆదేశాలిచ్చే వరకు బిఎల్ సంతోష్‌ను మాత్రం అరెస్ట్ చే యొద్దని న్యాయస్థానం సిట్ అధికారులను ఆదేశించింది. ఢిల్లీ పోలీసులు సిట్ విచారణకు సహకరించాలని హైకోర్టు తెలిపింది. రాజకీయ కక్షల కారణంగానే బిఎల్ సంతోష్‌కు సిట్ అధికారులు నోటీసులిచ్చారని.. 41ఎ సిఆర్‌పిసి ఇవ్వడం సరైంది కాదని బిజెపి నాయకుడు ప్రేమేందర్ రెడ్డి వేసిన పిటిషన్‌ను శనివారం హైకోర్టు అత్యవసరంగా విచారించింది.

పార్టీకి ప్రధాన కా ర్యదర్శి ఉన్న బిఎల్ సంతోష్‌ను విచారణ పేరుతో నోటీసులివ్వడంతో పాటు అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు చూస్తున్నారని, రాజకీయ కారణాలతో చేపడుతున్న ఈ చర్యలు మంచివి కావని పిటిషనర్ తర ఫు న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో సిట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా కేసు దర్యాప్తు వివరాలను, నోటీసులు ఇచ్చిన విషయాన్ని సిట్ మీడియాకు ఇస్తుందని తెలిపారు. ఈ కేసుకు బీఎల్ సంతోష్‌కు ఎలాంటి సంబంధం లేదని.. నిందితులుగా ఉన్న వాళ్లకు మాత్రమే 41ఎ సిఆర్‌పిసి నోటీసులు ఇవ్వాలన్న కర్నాటక హైకోర్టు తీర్పును ప్రస్తావించారు. నిందితుడు, లేదా అనుమానితుడికి 41 ఎ సిఆర్‌పిసి నోటీసులివ్వొచ్చని ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాంచంద్రభారతి, బీఎల్ సంతోష్‌కు వాట్సాప్ సందేశాలు పంపారని.. వాటిని నివృత్తి చేసుకునేందుకే నోటీసులిచ్చామని పోలీసుల తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రాంచందర్ రావు హైకోర్టుకు తెలిపారు.

కీలకమైన ఈ కేసు దర్యాప్తును బిజెపి పార్టీ అడ్డుకోవాలని బిజెపి చూస్తోందని.. హైకోర్టు సీజే ధర్మాసనం సైతం సిట్‌కు అధికారాలు కల్పించిన విషయాన్ని ఎజి బీఎస్ ప్రసాద్ వాదించారు. ఢిల్లీ పోలీసులు సైతం సిట్‌కు సహకరించడం లేదని.. ఇది కూడా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని అదనపు అడ్వకేట్ జనరల్ అన్నారు. బిఎల్ సంతోష్‌కు ఇప్పటికే వాట్సాప్‌లో నోటీసులు పంపించామని, నేరుగా వెళ్లి నోటీసులిచ్చేందుకు ప్రయత్నించగా.. ఢిల్లీ పోలీసులు సహకరించలేదని ఏఏజీ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం సిట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. బీఎల్ సంతోష్ నేరుగా నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు సిట్ అధికారులకు సహకరించాలని.. అంతే కాకుండా బీఎల్ సంతోష్ సైతం విచారణకు సహకరించాలని ఆదేశించింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగాలని,దర్యాప్తు గోప్యంగా ఉంచాలని సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఎంఎల్‌ఎల కొనుగోలు కేసులో సిట్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News