ఢిల్లీ: ఢిల్లీలో చెలరేగిన అల్లర్లు అదుపులోకి వస్తున్నాయి. అల్లర్లలో ఇప్పటివరకు 23 మంది మృతి చెందగా 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1984 పరిస్థితులు పునరావృతం కాకూడదని హైకోర్టు ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. భద్రంగా ఉన్నామన్న భావన ప్రజల్లో కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఢిల్లీలో ప్రతి పౌరుడికి జడ్ కేటగిరీ భద్రత ఉందనే విశ్వాసం కల్పించాలని కేంద్రానికి తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, స్థానికులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సూచనలు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రసంగించిన వారి వీడియోలను ఢిల్లీ హైకోర్టు పరిశీలించింది. బిజెపి నేతలు అనురాగ్ ఠాకూర్, కపిల్ మిశ్రా, పర్వేశ్ ఠాకూర్, అభయ్ వర్మ ప్రసంగాలకు సంబంధించిన వీడియోలను ఢిల్లీ హైకోర్టు వీక్షించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఎలా దర్యాప్తు చేస్తున్నారని ఢిల్లీ పోలీసులను కోర్టు ప్రశ్నించింది. ఆ నలుగురు బిజెపి నేతలపై కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈశాన్య ఢిల్లీ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు శాంతి, సహనం పాటించాలని మోడీ కోరారు.