హైదరాబాద్ః సినీ దర్శకుడు రాంగోపాల్వర్మకు మంగళవారం నాడు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్కౌంటర్ మృతుల కుటుంబాలు ఇప్పటికే మనోవేదనకు గురవుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణమూర్తి కోర్టుకు తెలిపారు. ఈ చిత్రాన్ని నిర్మించి వారిని గ్రామంలో కూడా ఉండనివ్వకుండా చేస్తున్నారని, దిశ చిత్రంలో వారిని దోషులుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్ తరపు లాయర్ పేర్కొన్నారు. దిశ చిత్రం విడుదల కాకుండా స్టే ఇవ్వాలని ఆయన కోరారు. పిటిషనర్ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. దిశ ఎన్కౌంటర్ చిత్రాన్ని నిలిపివేయాలని నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
వివాదాస్పద సినిమాలు నిర్మిస్తూ నిత్యం వార్తలో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తాజాగా హైకోర్టు నుంచి షోకాజు నోటీసులు అందాయి. దిశ ఎన్కౌంటర్ సినిమాను నిలిపివేయాలని నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడం వల్ల సినిమాపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.దిశ ఘటనపై జ్యుడిషియల్ కమిషన్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో సినిమా ఎలా తీస్తారని ప్రశ్నించారు. స్పందించిన హై కోర్టు సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు ముంబై, బ్రాంచ్ కార్యాలయం హైదరాబాద్, దర్శకుడు వర్మ, యూనియన్ ఆప్ ఇండియా, ఇన్ఫర్మేషన్ బ్రాడ్ కాస్టింగ్కు షోకాజు నోటీసులు జారీ చేసింది. దిశ ఎన్కౌంటర్ సినిమా ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్లో రిలీజై హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ నెల 26న సినిమా విడుదలచేయడానికి వర్మ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.