Friday, March 29, 2024

హైకోర్టు సిజెగా హిమా కోహ్లి

- Advertisement -
- Advertisement -

Hima Kohli appointed as Chief Justice of Telangana

హైదరాబాద్ : హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొంటూ కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ హిమా కోహ్లికి సిజెగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణకు బదిలీ చేశారు. ప్రస్తుత సిజె జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్‌కు బదిలీ అయ్యారు. హైకోర్టుకు తొలి మహిళ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉమ్మడి హైకోర్టు చరిత్రలోనూ ఇంతవరకు మహిళ సిజె లేరన్నది తెలిసిందే.

ఇదిలావుండగా 1959 సెప్టెంబరు 2న ఢిల్లీలో జన్మించిన జస్టిస్ హిమా కోహ్లీ అక్కడే ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బిఎ, ఎంఎ(హిస్టరీ) చేసిన అనంతరం న్యాయశాస్త్రం చదివారు. 1984లో లా డిగ్రీ పొంది, అదే సంవత్సరం ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. 1999- 2004 మధ్య ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్‌గా, న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యులుగా చేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులై 2007 ఆగస్టు 29న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది మే 20 నుంచి ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, ఈ ఏడాది జూన్ 30 నుంచి నేషనల్ లా యూనివర్సిటీ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News