పూర్తిస్థాయి నీటి సామర్థం 1763.50, ఎఫ్టిఎస్ 2.968 టిఎమ్సిలు
ప్రస్తుతం నీటి మట్టం 1762, ఎఫ్టిఎస్ 2.603 టిఎమ్సిలు
రాజేంద్రనగర్ : హిమాయత్సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. గడిచిన పదేళ్ళలో ఎన్నడూ లేని విధంగా జలాశయంలో జలకళ ఉట్టిపడుతోంది. ఈ రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50 కాగా నీటి నిల్వ సామర్థం 2.968 టిఎమ్సిలు. సోమవారం సాయంత్రానికి ఎఫ్టిఎల్ లెవెల్కి కేవలం 1.5 తక్కువ అంటే మరో 365 టిఎమ్ల నీరు చేరితే దిగువ ప్రాంతానికి అధిక జలాలను వదలాల్సిందే. దీంతో అధికారులు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఏ సమయంలో అయినా హిమాయత్ సాగర్ గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్లు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ సోమవారం సాయంత్రం జలమండలి జారీ చేసిన పత్రికా ప్రకటనను రాజేంద్రనగర్ మిడియాకు విడుదల చేశారు.
తుఫాను కారణంగా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వరద పెద్ద ఎత్తున హిమాయత్సాగర్కు చేరే అవకాశం ఉంటుంది. అలా వరద చేరితే ఫ్టిఎల్ లెవెల్ 1763కి చేరుకోగానే హిమాయత్సాగర్ డ్యామ్ భద్రత కారణాల దృష్టా గేట్లు తెరిచి నీటిని మూసీలోకి విడుదల చేయడానికి వాటర్ బోర్డ్ కావలసిన ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, హిమాయత్సాగర్ దిగువ ప్రాంతంతో పాటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అటు వైపుగా వెళ్లకూడదని ఆర్డీవో చంద్రకళ సూచించారు.