హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన హోంగార్డుకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది. నగర సిసిఎస్లో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న బొట్ల మల్లిఖార్జున(40) నగరంలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాడు. తన ఇంటి పక్కన ఉండే కుటుంబంలో వికలాంగురాలైన బాలిక(16) ఉంది. నిందితుడు బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో తినుబండారులు ఇచ్చేవాడు. ఈ క్రమంలోనే అక్టోబర్, 2020న బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేనిసమయంలో అత్యాచారం చేశాడు.
ఇలా రెండు సార్లు బాలికపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపివేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు. దీంతో బాలిక ఐదు నెలల గర్భవతి అయింది. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలికను నిలదీయగా అసలు విషయం చెప్పింది. వెంటనే తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. తాజాగా కోర్టు నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జరిమానాగా విధించిన 90వేలను బాధితురాలికి ఇవ్వాలని ఆదేశించింది. కేసును పోలీసులు శాస్త్రీయ ఆధారాలను సేకరించి నిందితుడికి 60 రోజుల్లోనే శిక్షపడే విధంగా చేశారు. డిసిపి కల్మేశ్వర్, ఎసిపి వెంకటరమణ, ఇన్స్స్పెక్టర్ ఎల్లప్ప, హెచ్సి కెసిహెచ్ నాయుడు, పిసి అనంతయ్య దర్యాప్తు చేశారు.