మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్ డౌన్ ప్రకటించడంతో తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లోని అన్నీ ప్రైవేట్ హాస్టల్స్ మూసివేయడం లేదని, ఎట్టి పరిస్థితుల్లో హాస్టళ్లను బంద్ చేయమని సైబరాబాద్ వసతి గృహాల అసోసియేషన్ ప్రతినిధులు తేల్చిచెప్పారు. ఈ మేరకు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వసతి గృహాల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, హాస్టల్స్ బంద్ చేస్తున్నట్టు తాము ఎక్కడా ప్రకటించలేదని, విద్యార్థులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామంటూ వస్తున్న వార్తలు కరెక్టు కాదన్నారు. ఈ అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ప్రభుత్వ సూచనల మేరకు తెరిచే ఉంచుతున్నామని, హాస్టల్స్ లో ఉన్న వాళ్లకి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. హాస్టళ్లలో ఎవరైతే ఉంటున్నారో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. సైబరాబాద్ ఐటీ జోన్ లో ఐదు వందలకు పైగా హాస్టల్స్ ఉన్నాయని, వాటిలో ఎక్కువ శాతం ఉంటోంది ఐటి ఉద్యోగులేనని తెలిపారు. ఇందులో అధిక శాతం మంది హాస్టల్స్ నుంచే పని చేస్తున్నారని చెప్పారు.
Hostels are not closed in Cyberabad