ఇల్లంతకుంట: అద్దె ఇంట్లో ఉన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్దారణ కావడంతో ఆ ఇంటి యజమాని బాధితున్ని ఇంటి నుంచి బయటికి వెళ్లగొట్టాడు. ఈ ఘటన శనివారం కరీంనగర్ జిల్లా, జమ్మికుంటలో చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండ లం, లక్ష్మన్నపల్లికి చెందిన నాగేంద్రబాబు జమ్మికుంటలోని కృష్ణకాలనీలో చాలా కాలంగా ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. పేయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
దురదృష్టవశాత్తు అతనికి కరోనా పాజిటివ్ అని శుక్రవారం నిర్దారణ అయ్యింది. దీంతో సదరు ఇంటి యజమాని కరోనా వచ్చిన వారు మా ఇంట్లో ఉండడానికి వీలులేదని అతన్ని బలవంతంగా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. దీంతో బాధితుడు స్వగ్రామం లక్ష్మన్నపల్లికి వెళ్లిపోయాడు. జమ్మికుంటలో తన ఇంటి యజమాని అన్యాయంగా ఇంటి నుంచి వెళ్లగొట్టాడని సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అతని కుటుంబంలోని మరో ఇద్దరిని పరీక్ష నిమిత్తం హుజురాబాద్ ఆసుపత్రికి పంపారు.