Thursday, April 25, 2024

వాట్సప్ డేటాబేస్ లీక్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌కు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్‌నుంచి భారీగా డేటా లీక్ అయింది. దాదాపు 50 కోట్ల వాట్సప్ యూజర్ల ఫోన్ నంబర్లు ఆన్‌లైన్‌లో అమ్మకానికి ఉంచినట్లు తాజాగా సైబర్ న్యూస్ నివేదిక వెల్లడించింది. అమెరికా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు విక్రయానికి ఉంచినట్లు తెలిపింది. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరమ్‌లో ఈ ఫోన్ నంబర్ల విక్రయానికి సంబంధించి ఓ ప్రకటన పెట్టినట్లు సౌబర్ న్యూస్ తెలిపింది. 48.7 కోట్ల వాట్సప్ యూజర్ల ఫోన్ నంబర్లతో 2022 డేటాబేస్‌ను విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్ ఈ నెల 19న ఆన్‌లైన్‌లో ప్రకటన ఇచ్చాడు. ఇందులో అమెరికా, యుకె, ఈజిప్టు , ఇటలీ, సౌదీ అరేబియాతో పాటుగా భారత యూజర్ల నంబర్లు కూడా ఇందులో ఉన్నాయట.

అత్యధికంగా ఈజిప్టునుండి 4.5 కోట్లు, అమెరికానుంచి 3.2 కోట్లు, ఇటలీనుంచి 3.5 కోట్లు, సౌదీ అరేబియానుంచి 2.9 కోట్లు, ఫ్రాన్స్‌నుంచి 2 కోట్లు, టర్కీనుంచి 2కోట్లు, యుకెనుంచి 1.1 కోట్లు, రష్యానుంచి దాదాపు కోటిమంది యూజర్ల నంబర్లు లీకైనట్లు సైబర్ న్యూస్ కథనం పేర్కొంది. భారత్‌నుంచి 61 లక్షల మందికి పైగా యూజర్ల నంబర్లు లీకయినట్లు తెలిపింది. ఒక్కో దేశానికి చెందిన యూజర్ల నంబరుకు ఒక్కో ధర పెట్టినట్లు తెలిపింది. ఉదాహరణకు అమెరికా డేటా సెట్ అయితే 7 వేల డాలర్లు, యుకె డేటా ధర అయితే 2,500 డాలర్లు, జర్మనీ యూజర్ల నంబర్ల ధర 2 వేల డాలర్లుగా ఉన్నట్లు ఆ కథనం వెల్లడించింది.

ఈ నంబర్లను సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేసి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆ కథనం హెచ్చరించింది. అందువల్ల గుర్తు తెలియని నంబర్లనుంచి కాల్స్, మెస్సేజిలు వస్తే స్పందించవద్దని హెచ్చరించింది. దీనిపై వాట్సప్ మాతృసంస్థ మెటాను సంప్రదించడానికి సైబర్‌న్యూస్ ప్రయత్నించింది కానీ ఆ సంస్థ స్పందించలేదు. కాగా మెటాకు చెందిన సంస్థల్లో డేటా లీక్ ఘటనలు ఇదే తొలిసారి కాదు. గత ఏడాది కూడా 50 కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ యూజర్ల డేటా హ్యాకర్ల చేతికి చిక్కి ఆన్‌లైన్‌లో లీకయినట్లు వార్తలు వచ్చాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News