మన తెలంగాణ/అశ్వాపురం: మృగశిర కార్తీ రోజున కొండ గొర్రెను వేటగాళ్లు కోసి రహస్యంగా మాంసం విక్రయించారు. పోడు వ్యవసాయంతో అడవిని కోల్పోతున్న అటవీ శాఖ తన చాలీచాలని సిబ్బందితో అడవులను రక్షించలేక చేతులెత్తేస్తుంది. ఫలితంగా అడవిలో బీడుభూముల, రిజర్వ్ ఫారెస్టు, గుట్టలను సైతం కబ్జాదారుల ఆక్రమించి దర్జాగా పట్టాలు చేసుకుంటుంటే చేష్టలుడిగి చూస్తున్న అటవీ శాఖ అధికారులు కనీసం అడవిలోని వణ్య ప్రాణులను రక్షించలేక పోవటం సిగ్గుచేటు. వేటగాళ్లు ఎక్కడుంటారో, ఎక్కడ ఉచ్చులు వేస్తారో, ఏఏ ప్రాంతాలలో మాంసం విక్రయిస్తారో అంతా అటవీశాఖాధికారులకు తెలుసు అని, మామూళ్ల మత్తులో ఉండటం వల్ల యధేచ్చగా వన్యప్రాణులు వధిస్తున్నా చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ వారంలో గొందిగూడెం, వెంకటాపురం, తుమ్మలచురువు ప్రాంతాలలో రెండు కొండ గొర్రెలు, ఒక దుప్పిని కోసి మాంసం అమ్మినట్లుగా విశ్వసనీయ సమాచారం. అడవిని ఎలాగు కాపాడలేరు కనీసం వన్యప్రాణులను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.