సిద్దిపేట: బయట తిరిగితే కరోనా వైరస్ కాటేస్తుందని భార్య చెప్పడంతో భర్త మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గజ్వేల్ ప్రాంతంలో రాములు (60) అనే వ్యక్తి ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా షాపు బంద్ కావడంతో తన సొంతూరు లింగారెడ్డిపల్లికి వెళ్లాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూనే ఉన్నాడు. బయట తిరిగితే కరోనా వైరస్ వ్యాపిస్తుందని భర్తకు పలుమార్లు భార్య చెప్పింది. ఐనా వినకుండా గజ్వేల్ వెళ్లి వచ్చాడు. అంతే కాకుండా ఊళ్లో అందరి ఇళ్లకు వెళ్తుండడంతో భార్య ఎందుకు తిరుగుతున్నావని భర్తను ప్రశ్నించింది. దీంతో ఇద్దరు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మనస్థాపం చెందిన రాము బుధవారం వేకువజామున గ్రామ శివారులో మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. తెలంగాణలో ఇప్పటి వరకు 943 కరోనా కేసులు నమోదు కాగా 24 మంది మృత్యువాతపడ్డారు.