లక్నో: ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో గర్భవతి అయిన భార్యను ఓ భర్త ముక్కలు ముక్కులుగా నరికి గ్రైండర్లో వేసి అనంతరం శరీర భాగాలను తగలబెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని రాయ్బరేలీలో జరిగింది. తన తల్లిని తండ్రే చంపాడని పెద్ద కూతురు చెప్పడంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. 2011లో రవీంద్ర (35) అనే యువకుడు ఊర్మిళ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మరో సారి ఊర్మిళ గర్భవతి కావడంతో మళ్లీ అమ్మాయి పుడుతుందని రవీంద్ర అనుమానం పెంచుకున్నాడు. తన తండ్రి, సోదరుల సహాయంతో జనవరి 4న ఊర్మిళ్ల గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు, ముక్కలుగా నరికి గ్రైండర్లో వేశాడు. ముక్కలను మూటగట్టి ఓ ప్రదేశంలో కాల్చివేశాడు. ఊర్మిళ కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులకు అనుమానం కలిగింది. ఊర్మిళ పెద్ద కూతురు అమ్మని చంపేశారని అమ్మమ్మ, తాతకు తెలపడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి రవీంద్రను అరెస్టు చేశారు. రవీంద్ర సోదరుడు, తండ్రి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.