చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి
నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
మన తెలంగాణ/ఎల్బినగర్: పనిచేయమన్నందుకు భార్యపై కోపం పెంచుకుని పెట్రోల్ పోసి నిప్పటించిన సంఘటన నగరంలోని సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మహిళా పోలీసుల కథనం ప్రకారం…. మహబూబాబాద్కు చెందిన జిల్లా పెద్ద వంగర మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఈదురు వెంకన్న భార్య సుభద్రతకు ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బతుకుదెరువు కోసం భార్యాపిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం హైదరాబాద్కు వలసవచ్చాడు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైత్రీనగర్లో సుభద్ర వాచ్ఉమెన్గా పనిచేస్తుండగా వెంకన్న పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. సుభద్ర పనికి వెళ్లమని వెంకన్నను తరచూ చెబుతుండేది.
దీంతో సుభద్రపై కక్ష్య పెంచుకున్న వెంకన్న శనివారం రాత్రి అపార్ట్మెంట్లో నిలిపి ఉన్న బైక్ నుంచి పెట్రోల్ తీసి సుభద్రపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. సుభద్ర మంటలకు తాళలేక వెంకన్నను పట్టుకుంది. దీంతో అతడికి కూడా గాయాలయ్యాయి, అరుపులు విన్న వారి కుమారులు ప్రవీణ్, మహేష్, అపార్ట్మెంట్ వాసులు మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిని సుభద్ర చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలియడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు వెంకన్నను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.