హైదరాబాద్: ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికలపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హైదరాబాద్లో పనిచేస్తున్న పోలీసులతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్లో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ, పార్లమెంటరీ ఎన్నికలను నగర పోలీసులు ప్రశాంతంగా నిర్వహించారని, దానికి గాను కేంద్రం నుంచి అవార్డు కూడా తీసుకున్నామని తెలిపారు. జిహెచ్ఎంసి ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి పోలీసులు కృషి చేయాలని కోరారు. రౌడీషీటర్లు ఎన్నికల్లో గొడవలు చేసేందుకు యత్నిస్తారని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నిస్తారని తెలిపారు. వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశించారు.
గొడవలు చేసేందుకు యత్నించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ, మిగతా శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. ముఖ్యంగా నాన్బేయిలబుల్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, వ్యక్తిగత గన్స్ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. బ్యాంక్ గార్డులు, కొందరు ప్రత్యేకమైన వ్యక్తులకు మినహాయింపు ఉందని తెలిపారు. బైండోవర్స్ను వెంటనే అమలు చేయాలని అన్నారు. దొంగతనాలు చేసేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పోలీసులు కష్టపడి పనిచేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్, అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ అనిల్కుమార్, డిఎస్ చౌహాన్, జాయింట్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి, డిసిపిలు, ఎసిపిలు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.
Hyderabad CP Anjanikumar meeting with city police