హైదరాబాద్: రంజీ సీజన్లో హైదరాబాద్ పేలవమైన ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా రాజస్థాన్తో సోమవారం ప్రారంభమైన రంజీ మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 171 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచుల్లో ఐదింటిలో ఓటమి పాలైన హైదరాబాద్ మరోసారి అదే బాటలో ప్రయాణిస్తోంది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే రాజస్థాన్ బౌలర్ల ధాటికి తట్టుకోలేక తక్కువ స్కోరుకే కుప్పకూలింది.
వికెట్ కీపర్ కొల్లా సుమంత్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను కాస్త దీటుగా ఎదుర్కొన్న సుమంత్ ఏడు ఫోర్లతో 51 పరుగులు చేశాడు. మరోవైపు చామ మిలింద్ మూడు ఫోర్లు, ఒక సిక్స్తో 34 పరుగులు సాధించాడు. సందీప్ 38 పరుగులతో రాణించాడు. మిగతావారు విఫలం కావడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ 171 పరుగుల వద్దే ముగిసింది. ప్రత్యర్థి బౌలర్లలో అంకిత్ చౌదరి, రుతురాజ్ సింగ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా రెండు పరుగులు చేసింది.
ఆదుకున్న మజుందార్
కోల్కతా వేదికగా ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఒక దశలో వంద పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగాల్ను అనుస్తుప్ మజుందార్ ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న మజుందార్ 14 ఫోర్లతో 94 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. వికెట్ కీపర్ గోస్వావి (59) తనవంతు పాత్ర పోషించాడు. మరోవైపు ధాటిగా ఆడిన షైబాజ్ అహ్మద్ 8 ఫోర్లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో వికాస్ మిశ్రా మూడు వికెట్లు పడగొట్టాడు.