బోస్టన్/న్యూఢిల్లీ : కోవిడ్ రోగులపై హైడ్రోక్లోరోక్విన్ (హెచ్సిక్యూ) వాడకం వల్ల దుష్పలితాల అంశం వివాదాస్పదం అయింది. ఈ మలేరియా మందు వాడకంతో కరోనా వైరస్ రోగులు ఎక్కువగా చనిపోతున్నారనే వైద్య నివేదికను లాన్సెట్ జర్నల్ ఉపసంహరించుకుంది. భారత్లో ఎక్కువగా మలేరియా నివారణకు ఈ క్లోరోక్విన్ను వాడుతున్నారు. అయితే దీనిని కరోనా వైరస్ నివారణకు వాడితే రోగులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ వైద్య పరిశోధనా పత్రిక తమ పరిశోధనా పత్రంలో తెలిపింది. దీనిని ఇప్పుడు తాము వెనకకు తీసుకుంటున్నామని లాన్సెట్ తెలిపింది.
ముందుగా తాము జరిపిన విశ్లేషణలకు సంబంధించిన ప్రాథమిక డాటా మూలాలను ఇప్పటికైతే పూర్తి స్థాయిలో నిర్థారించలేకపోయినట్లు, మరెంతో కాలం దీనిపై వేచిచూడటం కుదరదని తేల్చుకున్నామని జర్నల్ ఒక ప్రకటన వెలువరించింది. కోవిడ్ వైరస్ తీవ్రతస్థాయిలో పరిశోధనలు, వ్యాక్సిన్ల తయారీ, వాటి ఫలితాలపై లాన్సెట్ వరుసగా అధ్యయన పత్రాలు వెలువరిస్తూ వస్తోంది.కోవిడ్ 19 రోగులకు క్లోరోక్విన్ను యాంటీబయాటిక్స్తో కానీ లేకుండా కానీ వాడటం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందనే పత్రాన్ని పరిశోధకుల బృందం రూపొందించింది.
దీనిని పత్రం రూపొందించిన వారు వెనకకు తీసుకున్నారు. గుండె జబ్బులు ఉన్న కోవిడ్ 19 రోగులలో ఎక్కువ మంది చనిపోతున్నారనే మరో వైద్య నిర్థారణను కూడా లాన్సెట్ ఉపసంహరించుకుంది. క్లోరోక్విన్ పనితీరు గురించి పరిశోధకులు వివరించలేదని, ఈ మందుత అత్యధిక మరణాలు ఉంటాయనే విషయం ఈ దశలో నిర్థారణకు అయ్యే అవకాశం లేదని జినోమిక్స్ సిఎస్ఐఆర్ ఇనిస్టూట్కు చెందిన ఉపిరితిత్తుల వ్యాధుల పరిశోధనా విభాగం డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ తెలిపారు.