ముంబయి: టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్తో పోల్చడం తనకు పెద్ద గౌరవమే అయినప్పటికీ అది సరైన పోలిక కాదని టీమిండియా టెస్టు బ్యాట్స్మన్ ఛెతేశ్వర్ పుజారా అన్నాడు. ఇండియా టుడే ఇన్స్పిరేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పుజారా పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు. టెస్టు క్రికెట్లో దిగ్గజ బ్యాట్స్మన్ రాహుల్ ద్రవిడ్తో పోల్చడం గొప్పగా ఉన్నా అది సరైన పోలిక కాదు. నా జీవితంలో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది.
అన్ని ఫార్మాట్లలో ఆడిన ద్రవిడ్లాంటి వ్యక్తి టెస్టుల్లో, వన్డేలలో పది వేలకు పైగా పరుగులు సాధించాడు. కాబట్టి నేను సాధించాల్సింది చాలా ఉంది. నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. ప్రస్తుతం అతడినుంచి సలహాలు తీసుకునే స్థితిలో ఉన్నా. అదృష్టవశాత్తు ద్రవిడ్ భాయ్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నాడు’ అని పేర్కొన్నాడు. రాహుల్ భాయ్ని తొలి సారి రంజీ సమయంలో కలిశాను.అతను టీమిండియాకు కెప్టెన్గా ఉన్నప్పుడు రాజ్కోట్ వచ్చాడు.
అప్పుడే తొలిసారి కలిసి మాట్లాడాను. అప్పుడు ద్రవిడ్ చాలా సౌమ్యంగా ఉన్నాడు. అప్పటికి నేను ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. రంజీ ఆటగాడినుంచి అంతర్జాతీయ క్రికెటర్గా ఎలా మారాలనేదానిపైనే తొలిసారి మాట్లాడా. తర్వాత నేను జట్టులోకి వచ్చాక ఇప్పుడేం చేయాలని అడిగాను.అంతర్జాతీయ క్రికెటర్గా మారే విషయంపై అతనికి అమితమైన పరిజ్ఞానం ఉంది. నేను వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నప్పుడు అతను విలువైన సూచనలు చేశాడు. నాలో మంచి నైపుణ్యం ఉందన్నాడు.నాకు సరైన అవకాశాలు వస్తాయని చెప్పాడు. చివరికి అలాగే జరిగింది. అలాగే నా ఆటలో పెద్దగా మార్పులు చేసుకోవద్దని, కొన్ని అంశాల్లో చిన్నపాటి మెళకువలుసరి చేసుకుంటే సరిపోతుందని చెప్పాడు’ అని పుజారా.. ద్రవిడ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు.