హైదరాబాద్: తక్కువ ధరకు భూమి ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఎవరినీ మోసం చేయలేదని దుబ్బాక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యాంకర్ కత్తి కార్తీక తెలిపారు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తికి రెండు నెలల క్రితమే లీగల్ నోటీసులు ఇచ్చామని అన్నారు. రాజకీయ కక్షతోనే తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. బంజారాహిల్స్ పోలీసులు కత్తి కార్తీక, మరో ఆరుగురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి కిప్పుడు ఛీటింగ్ కేసు ఎలా పెడతారని, తనను చంపుతామని బెదిరించిన వారిపై రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజకీయాల నుంచి తప్పుకోనని, జిహెచ్ఎంసి ఎన్నికలతో 2023లో దుబ్బాక నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మెదక్జిల్లా , అమీన్పూర్ గ్రామంలోని సర్వే నంబర్లు 322,323,324,329లోని 52ఎకరాల భూమి తమదేనని జిపిఏ హక్కులు తమ వద్దే ఉన్నాయని చెప్పి కార్తీక, ఆమె అనుచరులు వ్యాపారి దొరస్వామికి విక్రయించేందుకు రూ.35కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. దీనికి గాను దొరస్వామి నుంచి కోటి రూపాయలు తీసుకున్నారు. భూమకి యజమాని సిస్లా రమేష్గా తెలుసుకుని దొరస్వామి సంప్రదించాడు. తాను భూమి జిపిఎ హక్కులు ఎవరికీ ఇవ్వలేదని తెలపడంతో మోసపోయానని గ్రహించిన దొరస్వామి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిపై ఛీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
I did not deceive anyone says kathi karthika