Friday, March 29, 2024

నాపై విషప్రయోగం జరిగింది: ఇస్రో సైంటిస్టు సంచలన ఆరోపణలు

- Advertisement -
- Advertisement -

నాపై విషప్రయోగం జరిగింది
రాడార్ ప్రాజెక్టు నుంచి తప్పించేందుకు కుట్ర
హోంశాఖ హెచ్చరిక, సహోద్యోగి వల్లే చికిత్స సులువైంది
అమెరికా ఫ్రొఫెసర్ బెదిరించినా భయపడలేదు
ఇంట్లోకి పాములనూ వదిలారు -ఇస్రో సైంటిస్టు తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు

బెంగళూరు: ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త తపన్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. మూడేళ్ల క్రితం తనపై విష ప్రయోగం జరిగిందని ఫేస్‌బుక్ వేదికగా ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. 2017 మే 23న ఇస్రో ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న తనను చంపేందుకు కుట్ర జరిగినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ‘సుదీర్ఘ కాలం దాచి ఉంచిన రహస్యం’ పేరిట ఫేస్‌బుక్‌లో మిశ్రా చేసిన పోస్టు సంచలనం రేకెత్తిస్తోంది. ఆ రోజు తాను తీసుకున్న దోశ, చట్నీలో విషపూరిత రసాయనాన్ని కలిపారని తెలిపారు. ఈ విష ప్రయోగం జరిగిన తర్వాత శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డానని, చర్మంపై ఆసాధారణ దద్దుర్లు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌తో చర్మం పెచ్చులుగా ఊడిపోయిందన్నారు. గూఢచర్యంలో భాగంగానే తనపై ఈ కుట్ర జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. అందువల్లే ఓ ప్రముఖ రాడార్ ఆధారిత ప్రాజెక్టుకు సీనియర్ శాస్త్రవేత్తగా ఉన్న నన్ను తొలిగించేందుకే ఈ దాడి చేసి ఉంటారని తెలిపారు. ఈ కుట్రపై కేంద్ర హోంశాఖ అధికారులు తనను ముందే హెచ్చరించారని, ఓ సహోద్యోగి కూడా దీనిపై ముందే తనను అలర్ట్ చేసినట్లు మిశ్రా అన్నారు. వీరి వల్లే వైద్యులకు చికిత్స అందించడం సులువైందని, లేదంటే విష ప్రయోగం జరిగిన రెండు, మూడు గంటల్లోనే తాను చనిపోయి ఉండేవాడినని చెప్పారు. ఈ నిజాన్ని బహిర్గతం చేయవద్దంటూ ఇప్పటికీ తనకు వందలాది మెయిల్స్ వస్తున్నాయని మిశ్రా అన్నారు.

అంతేకాకుండా గత రెండేళ్లుగా తాను ఉంటున్న క్వార్టర్స్‌లోకి క్రమం తప్పకుండా కోబ్రా, క్రైట్ వంటి విషపూరిత పాములు కనిపించాయని చెప్పరు. సెకక్యూరిటీ సిబ్బంది వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. మానసిక వికలాంగుడైన తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. 2019లో అమెరికాకు చెందిన ఓ ప్రొఫెసర్ కిడ్ ప్రోకో పద్ధతిలో తనతో బేరం ఆడాడని, ఈ విషయం బయటకు రాకుండా చూస్తే తన కుమారుడికి ఓ ప్రముఖ కాలేజీలో అడ్మిషన్ కూడా ఇప్పిస్తానని మభ్యపెట్టాడని ఆరోపించారు. అయితే వీటికీ తాను బెదరలేదన్నారు. ఈ ఘటనపై ఇప్పటికైనా కేంద్రం దర్యాప్తు చేయాల్సిందిగా తపన్ మిశ్రా అభ్యర్థించారు. గత కొన్నాళ్లుగా డైరెక్టర్లతో చర్చించినా ఫలితం లేదని, దీని వెనుక దాగున్న కుట్రదారులెవరో ప్రభుత్వమే దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. స్పేస్ అప్లికేషన్ సెంటర్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించిన తపన్ మిశశ్రా ప్రస్తుతం ఇస్రోలో సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. జనవరి చివర్లో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

I was Poisoned: ISRO Scientist sensational claim

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News