ఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో జరిగిన మారణహోమంలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మను విధ్వంసకారులు 400 సార్లు పదునైన ఆయుధాలతో పొడిచినట్టు శవ పరీక్షలో తేలింది. అంకిత్ శర్మ హత్య వెనుక స్థానిక కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆప్ పార్టీ అతడిని సస్పెండ్ చేసింది. అంకిత్ శర్మ హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని నిందితులు చాంద్ బాఘ్ ప్రాంతంలో డ్రైనేజీలో పడేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంకిత్ శర్మ ఫిబ్రవరి -25న ఇంట్లో సరుకులు కొనడానికి మార్కెట్కు వెళ్లాడు. శర్మ తిరిగి రాకపోవడంతో ఆయన తండ్రి రవీందర్ కూమార్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రులు అన్ని వెతికాడు. తన కుమారుడు కనిపించకపోవడంతో ఖజౌరీ ఖాస్ పోలీస్ స్టేషన్లో రవీందర్ ఫిర్యాదు చేశాడు. చివరగా శర్మ కల్లు అనే వ్యక్తితో కనిపించినట్టుగా తండ్రి తెలిపాడు. చాంద్ బాఘ్ ప్రాంతంలో ఓ డ్రైనేజీలో మృతదేహం ఉన్నట్టు స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. మృతదేహం నిండా కత్తిపోట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ మృతదేహం అంకిత్ శర్మదిగా గుర్తించారు. పదునైన ఆయుధాలతో పొడవడంతో కడుపులోని పేగులన్ని బయటకు వచ్చాయని, ముఖంపై యాసిడ్ పోశారని పోలీసులు వెల్లడించారు. స్థానిక కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ఆఫీస్కు సమీపంలో అంకిత్ శర్మను హత్య చేశారు. తన కుమారుడిని తాహిర్ హుస్సేన్నే హత్య చేశాడని రవీందర్ కుమార్ ఖజారి ఖాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆప్ పార్టీ తాహిర్ హుస్సేన్ను సస్పెండ్ చేసింది. అంకిత్ శర్మను రెండు నుంచి నాలుగు గంటల పాటు పదునైన ఆయుధాలతో పొడిచారని బిజెపి నేత సంబిత్ పాత్ర ట్వీట్ చేశారు. శర్మ పేగులు బయటకు వచ్చేలా పొడిచారని, మృతదేహంపై 400 కత్తిపోట్లు ఉన్నట్టు శవ పరీక్షలో తేలిందని ట్వీట్ చేశారు. శర్మ ద్విచక్రవాహనంపై జైశ్రీరామ్ అనే వ్యాఖ్యం ఉండడంతో అతడిని చంపేశారని మరో బిజెపి లీడర్ ట్వీట్ చేశాడు. ఢిల్లీలో జరిగిన హింసకాండలో ఇప్పటి వరకు 38 మంది మరణించగా 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఐబి ఆఫీసర్ అంకిత్ శర్మ, కానిస్టేబుల్ రతన్ లాల్ ఉన్నాడు.