దుబాయి: ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో జరగాల్సిన పురుషుల ట్వంటీ20 ప్రపంచకప్పై నెలకొన్న అనిశ్చితికి ఇప్పట్లో తెరపడేలా కనిపించడం లేదు. వరల్డ్కప్ నిర్వహణకు సంబంధించి గురువారం జరిగే ఐసిసి సమావేశంలో స్పష్టమైన ప్రకటన విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో కూడా ఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. జూన్ పది వరకు దీనిపై వేచి చూడాలని ఐసిసి నిర్ణయించింది. వరల్డ్కప్ నిర్వహణకు సంబంధించి కొంత సమయం కావాలని సభ్య దేశాలు కోరడంతో తాము వేచి చూడాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఐసిసి ప్రతినిధి ఒకరూ అధికారికంగా ప్రకటించారు. జూన్ పదిన మరోసారి సభ్యదేశాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహిస్తామని ఆ ప్రతినిధి వివరించారు. ఆ సమావేశం తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని, అప్పటి వరకు వేచి చూడాలని ఆయన కోరారు. కాగా, అక్టోబర్లో ఆస్ట్రేలియాలో ఈ ప్రపంచకప్ జరగాల్సి ఉంది.
కానీ, ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్ర రూపం దాల్చడంతో టోర్నీ కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్ట్రేలియాలో విదేశీయుల రాకపై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. దీంతో వరల్డ్కప్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో ఈ టోర్నీలో పాల్గొనే జట్లలో అయోమయం నెలకొంది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఐసిసిపై ఒత్తిడి తేస్తున్నాయి. మరోవైపు నిర్ణీత సమయంలో టోర్నీని నిర్వహిస్తామనే పట్టుదలతో క్రికెట్ ఆస్ట్రేలియా ఉంది. అయితే పరిస్థితులు మాత్రం టోర్నీ నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో ప్రపంచకప్ నిర్వహణ దాదాపు అసాధ్యంగా మారింది. ఇక తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్న ఐసిసి మాత్రం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతోంది.
ICC meeting on T20 World Cup 2020