కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడే నిలిచి పోయిన క్రికెట్ పోటీలను తిరిగి ప్రారంభించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దుబాయిలోని ఐసిసి ప్రధాన కార్యాలయం నుంచి ఆయా దేశాల క్రికెట్ బోర్డు ప్రతినిధులతో ఐసిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా క్రికెట్కు సంబంధించి పలు మార్గదర్శకాలను కూడా ఐసిసి విడుదల చేసింది. బంతిపై లాలాజలం (ఉమ్మి)తో రుద్దడంపై నిషేధం విధించింది. సబ్బు నీరుతో తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు ఉపయోగించడం, కళ్లు, ముక్కు, నోరును చేతుల్తో తాకకుండా చూసుకోవాలి. దగ్గు, తుమ్ము వస్తే మోచేతిని అడ్డం పెట్టుకోవాలి. శీతల పానియాలు, తువాళ్లు ఒకరివి మరోకరూ వాడకూడదు. మాటి మాటికి అంపైర్ దగ్గరికి వెళ్ల కూడదు. వికెట్ పడినప్పుడూ ఆరడుగుల దూరం నుంచే అభినందించాలి.
కౌగిలింతలకు, చేతులు కలిపేందుకు అవకాశం ఉండదు. ఫిట్నెస్ను కాపాడకునేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. సాధ్యమైనంత వారకు భౌతిక దూరం పాటించాలి. ఆయా దేశాల ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. విదేశీ పర్యటనల సమయంలో కనీసం రెండు వారాల క్వారంటైన్ను విధిగా పాటించాలి. ప్రతి జట్టు ప్రత్యేక వైద్యుడిని నియమించాలి. అతను ఎల్లప్పుడూ క్రికెటర్లకు అందుబాటులో ఉండాలి. క్రికెటర్లకు సాధ్యమైనన్ని సార్లు వైద్య పరీక్షలు జరుపుతూ ఉండాలి. ఇలా ఎన్నో నిబంధనలను ఐసిసి అమల్లోకి తెచ్చింది. ఈ మార్గదర్శకాలను ప్రతి దేశ క్రికెట్ బోర్డు కచ్చితంగా అమలు చేయాలని ఐసిసి సూచించింది.