*నా ప్రాణాలను కొండగట్టు ఆంజనేయస్వామి కాపాడారు
*బ్రతికినంత కాలం కరీంనగర్కు రుణపడి ఉంటా
*జై తెలంగాణ నినాదం నాలోని అణువణువునా ఉంది
*జనసేనా పార్టీ అధినేత పవన్కళ్యాణ్
మన తెలంగాణ/కరీంనగర్ క్రైం ః నాకు తల్లి జన్మనిస్తే తెలంగాణ తల్లీ పునర్జన్మనిచ్చిందని జనసేన పార్టీ అధినేత పవన్కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళవారం రోజు కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని అనుకుని ఉన్న రేకుర్తిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన పెద్దపల్లి, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయ సమావేశానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరైనారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యక్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను మొదటిసారి కరీంనగర్ వచ్చిన సమయంలో విద్యుత్షాక్కు గురైనానని నాడు కొండగట్టు అంజనేయస్వామి వారే తన ప్రాణాలను కాపాడాడని అందుకే తాను బ్రతికున్నంత కాలం కరీంనగర్కు రుణపడి ఉంటానని అన్నారు. జై తెలంగాణ నినాదం నా అణువణువులో ఉందని జై తెలంగాణ నినాదం వందేమాతరం లాంటిదని అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 60 సంవత్సరాలకు తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అణగారిన ప్రజలకు అండగా ఉంటూ బిసి, ఎస్.సి, ఎస్.టి, మైనార్టీ వర్గాల ప్రజానీకానికి సామాజిక న్యాయం అందించేందుకు తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టానని పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజాసంక్షేమం కోసమే తన జీవితాన్ని ధారపోస్తానంటూ రాజకీయాల తరువాతనే సినిమా రంగానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరు గుతుందన్నారు. బతుకమ్మ పండగ, సమ్మక్క సారక్కలు తెలంగాణ బావజాలానికి, పౌరుషానికి ప్రతీకలుగా పేర్కొంటూ తెలంగాణ యాస, బాష, సంస్కృతి, కవులు, కళాకారులంటే తనకేంతో గౌరవమంటూ వారిని గుర్తించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్ర రాజధాని హైద్రాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం ఓ అద్భుతంగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. పోరాట పటిమ గల నాయకుడిగా కె.సి.ఆర్ అంటే తనకెంతో గౌరవమని పేర్కొన్నారు. జనసేన పార్టీ ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేస్తుందని ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అవసరమైతే రోడ్డు ఎక్కి పోరాడేందుకు తాము వెనుకాడమని అన్నారు. ప్రజల అండతో ఏదైనా సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.