ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాథ్ ప్రశంస
న్యూయార్క్ : కరోనా మహమ్మారితో పోరాటంలో భారత్ ముందుంటోందని, నిజంగా వ్యాక్సిన్ విధానానికి అక్షరాలా కట్టుబడి ఉందని ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్ గీతా గోపీనాధ్ ప్రశంసించారు. కరోనా సంక్షోభంలో వ్యాక్సిన్లు తయారు చేసి అనేక దేశాలకు సరఫరా చేయడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం డాక్టర్ హంసా మెహతా లెక్చర్ ప్రారంభ కార్యక్రమంలో గోపీనాధ్ ప్రసంగించారు. ప్రపంచం మొత్తం మీద వ్యాక్సిన్ల తయారీ హబ్ భారతేనని అభివర్ణించారు. బంగ్లాదేశ్ నేపాల్,మయన్మార్ వంటి పొరుగు దేశాలకు గ్రాంట్స్ ద్వారా వ్యాక్సిన్ సరఫరా చేయగలిగిందని ఆమె పేర్కొన్నారు. కరోనా వల్ల భారత్ బాగా దెబ్బతిన్నదని, 2020 లో సాధించిన 8 శాతానికి వ్యతిరేకంగా చాలా కష్టంగా జిడిపి 6 శాతం సాధించ గలిగిందని చెప్పారు. కరోనా సంక్షోభం ఉన్నా సరే 2021 లో 11.5 శాతం వంతున డబుల్ డిజిట్ సాధిస్తున్నట్టు ఐఎంఎఫ్ వెల్లడించింది.