కొవిడ్19పై అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: తల్లుల నుంచి పిల్లలకు రోగనిరోధకశక్తి బదిలీ అవుతున్నట్టుగా కొవిడ్19పై సింగపూర్లో జరిగిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. కొవిడ్19 పాజిటివ్గా గుర్తించి హాస్పిటల్లో చేరిన 16మంది గర్భిణీలపై జరిపిన పరిశోధనలో ఇది స్పష్టమైంది. పిల్లలకు జన్మనిచ్చినపుడు వారి బొడ్డు తాడులో కరోనాను నిరోధించే యాంటీబాడీలను పరిశోధకులు గుర్తించారు. సింగపూర్లోని నాలుగు ఆస్పత్రులకు చెందిన పేషెంట్లపై ఈ పరిశోధన నిర్వహించారు. పరిశోధన వివరాల్ని ఆ దేశ వైద్య పత్రిక ‘ది అన్నల్స్’ ప్రచురించింది. అయితే, తల్లుల పాలు లేదా మావి ద్వారా పిల్లలకు కరోనా బదిలీ అవుతుందనేందుకు ఆధారాలు లేవని పరిశోధకులు తెలిపారు. అంటే కరోనా సోకిన తల్లుల నుంచి పిల్లలకు ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందని నిర్ధారించలేమని తెలిపారు. ఈ అధ్యయనం కోసం ఎంచుకున్న తల్లులెవరూ కరోనాతో మరణించలేదు. ఈ పరిశోధన ద్వారా తల్లుల నుంచి పిల్లలకు రోగనిరోధకశక్తి బదిలీ అవుతుందని కచ్చితమైన సూత్రీకరణ చేయలేమని మరికొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.