Wednesday, March 22, 2023

నల్లగొండలో దారుణహత్య

- Advertisement -

murder
*మున్సిపాలిటీ చైర్‌పర్సన్ భర్త శ్రీనివాస్ హత్య
*ప్రభుత్వమే హత్య చేయించింది: కోమటిరెడ్డి బ్రదర్స్

మన తెలంగాణ/ నల్లగొండ ప్రతినిధి: నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. నల్లగొండ మున్సిపాలిటీ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్(42)ను ప్రత్యర్ధులు బుధవారం అర్ధరాత్రి రాళ్లతో కొట్టి హత్యచేశారు. ఈ హత్యాసంఘటన జిల్లాను కుదిపివేసింది. రాత్రి 12 గంటల సమయంలో గాంధీనగర్‌లో గొడవ జరుగుతుందని ఫోన్ కాల్ రావడంతో తన సహచరులతో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరి వెళ్లారు. ఎంతసేపటికి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుటుంభ సభ్యులు గాందీనగర్ పరిసరాల్లో వెతకగా మురుగు కాల్వలో శవమై కన్పించినట్లు శ్రీనివాస్ కుటుంభ సభ్యులు భోరున విలపిస్తూ చెప్పారు. శవాన్ని గుర్తుపట్టలేని విధంగా హంతకులు శ్రీనివాస్ తలను రాళ్ళతో చిధ్రం చేశారు. నల్లగొండ ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ సుధాకర్ లు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీంను, డాగ్ స్వాడ్ ను రప్పించి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం కొరకు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణంలోని కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకొన్నారు. శ్రీనివాస్ హత్య సమాచారంతో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హైద్రాబాద్ నుండి బయలుదేరి గురువారం తెల్లవారుఝామున నల్లగొండ చేరుకొని శ్రీనివాస్ మృతదేహం వద్ద బోరున విలపించారు. కుటుంభ సభ్యులను ఓదార్చారు. కాగా శ్రీనివాస్ హత్యకేసులో పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలో రౌడీల రాజ్యం నడుస్తోంది: కోమటిరెడ్డి బ్రదర్స్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రౌడీల రాజ్యం నడుస్తోందని సీఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి, ఎమెల్సీ రాజగోపాల్‌రెడ్డిలు ఆరోపించారు. శ్రీనివాస్ హత్యకు నిరసనగా గురువారం నల్లగొండలో బంద్ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గడియారం సెంటర్‌లో కోమటిరెడ్డి బ్రదర్స్ ధర్నా చేశారు. మాజీ నక్సలైట్లను, నయీంతో అంటకాగిన వారితో అరాచాకాలు చేయిస్తున్నారన్నారు. అధికారపార్టీలో చేరకపోతే చంపుతామని పలుమార్లు శ్రీనివాస్‌ను బెదిరించారని అన్నారు. గన్‌మెన్‌లను ఇవ్వమని మున్సిపల్ చైర్‌పర్సన్ దంపతులు అర్ధించినప్పటికి వారికి కావాలనే ప్రభుత్వం రక్షణ కల్పించలేదన్నారు. రాజకీయంగా తనను ఏమీ చేయలేకనే పథకం ప్రకారమే తన అనుచరుడిని హత్యచేశారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే నన్నారు. శ్రీనివాస్ హత్యపై సిబిసిఐడి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితుల 6 నెలల ఫోన్ కాల్ డేటాను విశ్లేషిస్తే శ్రీనివాస్ హత్యకు పథకం పన్నిన అసలు నేరస్థులు వెలుగులోకి వస్తారని అన్నారు. ప్రస్తుత డిఎస్పీ హయంలో కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. రౌడి రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News