Thursday, April 25, 2024

ప్రైవేటులో ఒక్క డోసు రూ.1000

- Advertisement -
- Advertisement -

In private single dose of Covishield is Rs.1000

 

కొవిషీల్డ్ పంపిణీ డ్రైవ్ చారిత్రక సందర్భం
సామాన్యులకు అండగా నిలుస్తాం
ప్రభుత్వ అభ్యర్థన మేరకు ప్రత్యేక ధరకు అందించాం
సీరం సిఇఒ అదర్ పూనావాలా ప్రకటన

ముంబయి : కరోనా టీకా కొవిషీల్డ్ ధరపై సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) కీలక ప్రకటన చేసింది. దేశంలో తొలి కొవిడ్-19 వ్యాక్సిన్ అందించడం ఒక చారిత్రక క్షణంగా అభివర్ణిస్తూ సీరం సిఇఒ అదర్ పూనావాలా ఆనందం పంచుకున్నారు. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను కేంద్రం ‘ప్రత్యేక ధర‘ కు కొనుగోలు చేసినట్లు పూనావాలా మంగళవారం ధృవీకరించారు. ఎంపిక చేసిన కొందరు మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మొదటి 100 మిలియన్ డోసులకు మాత్రమే 200 రూపాయల ప్రత్యేక ధరకు అందించామన్నారు. ఇక ప్రైవేట్ మార్కెట్లలో మాత్రం రూ. 1000కి విక్రయిస్తామని చెప్పారు.

అలాగే ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను అందించడమే తమ ప్రధాన సవాల్ అని పేర్కొన్నారు. ప్రతి నెలా 70-80 మిలియన్ మోతాదుల టీకాలను తయారుచేస్తామన్నారు. ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు ప్రధానంగా సామాన్యులకు, బలహీనంగా, పేదలకు, ఆరోగ్య కార్యకర్తలతోపాటు, ఇతర అణగారిన వర్గాలకు మద్దతు ఇవ్వడమే తమ లక్షమన్నారు. ఇందులో భాగంగా లభాపేక్ష లేకుండా తక్కువ ధరను నిర్ణయించామన్నారు. 100 మిలియన్ యూనిట్ల సరఫరా తర్వాత కూడా ప్రభుత్వానికి చాలా సహేతుకమైన ధరకే అందిస్తామని, అయితే ఇది రూ.200 కన్నా కొంచెం ఎక్కువే అవుతుందన్నారు.

విదేశీ దేశాలకు తమటీకాను అందించనున్నామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు జరుగుతున్నాయన్నారు. పూణే విమానాశ్రయానికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్ వ్యాక్సిన్ తొలి లోడ్‌ను తీసుకెళ్తున్న మూడు ట్రక్కులు ఈ రోజు దేశవ్యాప్తంగా 13 ప్రదేశాలకు చేరుకున్నాయి. ఢిల్లీ, కర్నాల్, అహ్మదాబాద్, చండీగఢ్, లక్నో, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, భువనేశ్వర్, కోల్‌కతా, గౌహతి తదితరాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News