హత్యాయత్నం కేసులో నేరస్థుడు
అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు
హైదరాబాద్: హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి కుక్కలను వదిలిన సంఘటన నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని ఫిలింనగర్కు చెందిన ఆరిఫ్ ఉద్దిన్, సయిద్ హుస్సేన్ అహ్మద్ మధ్య భూమి విషయంలో వివాదం ఉంది. తీన్ బంజారాకాలనీలోని 300 గజాల ప్లాట్ విషయంలో ఇరువురి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలోనే ఈ నెల 6వ తేదీన ఆరిఫ్ ఉద్దిన్, సయిద్ హుస్సేన్పై హత్యాయత్నం చేశాడు. బాధితుడు వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ముగ్గురు పోలీసులు ఇంటికి వెళ్లారు. దీంతో ఆగ్రహం చెందిన నిందితుడు ఆరిఫ్ పోలీసులపైకి కుక్కలను వదిలాడు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన పోలీసులు కొద్ది సేపటి తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉదయ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.