సమరోత్సాహంతో భారత్
ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా, నేడు తొలి టి20
కాన్బెర్రా: ఇప్పటికే వన్డే సిరీస్ను కోల్పోయిన టీమిండియా కనీసం ట్వంటీ20 సిరీస్నైన సాధించాలనే పట్టుదలతో ఆస్ట్రేలియా జరిగే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి ట్వంటీ20 మ్యాచ్ శుక్రవారం జరుగనుంది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో గెలిచిన టీమిండియా ఈ మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఇక ఆతిథ్య జట్టు కూడా జోరుమీదుంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లు ఇరు జట్లకు అందుబాటులో ఉన్నారు. అయితే కీలక ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కావడం మాత్రం కాస్త ఆందోళన కలిగించే అంశమే. కాగా ఇరు జట్లలోనూ బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడుతున్నారు. స్టీవ్ స్మిత్, అరోన్ ఫించ్, మాక్స్వెల్, లబూషేన్, కేరి తదితరులతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. స్మిత్ వన్డేల్లో రెండు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. ఫించ్ కూడా కెప్టెన్సీ ఇన్నింగ్స్లతో అలరిస్తున్నాడు. డిఆర్సీ షార్ట్ చేరికతో బ్యాటింగ్ మరింత బలోపేతంగా తయారైంది. భారత బ్యాట్స్మెన్ కూడా జోరుమీదున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి నిలకడైన బ్యాటింగ్తో అలరిస్తున్నాడు. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్లు కూడా వన్డేల్లో సత్తా చాటారు. ఇది కూడా భారత్కు కలిసి వచ్చే అంశమే.
రాహుల్ రాణించాలి
వన్డేల్లో ఆశించిన స్థాయిలో ఆడడంలో విఫలమైన లోకేశ్ రాహుల్ కనీసం ట్వంటీ20లోనైన తన స్థాయికి తగ్గ ఆటను కనబరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అతనితో పాటు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా మెరుగ్గా ఆడక తప్పదు. రెండు వన్డేల్లో ఛాన్స్ లభించినా మయాంక్ ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాడు. ఈసారి ఛాన్స్ లభిస్తే సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్పై కూడా జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఐపిఎల్లో ధావన్ పరుగుల వరద పారించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్లో కూడా అతను మెరుపులు మెరిపించాలని జట్టు కోరుకుంటుంది. ఇక కెప్టెన్ కోహ్లి ఫామ్లో ఉండడం కూడా జట్టుకు కలిసి వచ్చే అంశమే. వన్డేల్లో రాణించిన కోహ్లి ఈ సిరీస్లో కూడా జట్టును ముందుండి నడిపించాలని భావిస్తున్నాడు. అంతేగాక శ్రేయస్ అయ్యర్ కూడా తన బ్యాటింగ్ను మరింత మెరుగు పరుచుకోక తప్పదు. బాగానే ఆడుతున్నా భారీ స్కోర్లు మాత్రం సాధించలేక పోతున్నాడు. టి20 సిరీస్ మరింత మెరుగ్గా ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు. మరో సీనియర్ మనీష్ పాండేకు కూడా తుది జట్టులో అవకాశం లభించినా ఆశ్చర్యం లేదు. ఐపిఎల్లో రాణించిన మనీష్కు వన్డేల్లో ఆడే అవకాశం లభించలేదు. కానీ టి20లలో ఛాన్స్ దొరికితే చెలరేగి పోవాలని తహతహలాడుతున్నాడు. ఇక హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలు వన్డే సిరీస్లోమెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అలాంటి జోరునే కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐపిఎల్లో హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయిన విషయం తెలిసిందే. కాగా, వన్డేలతో పోల్చితే టి20లలో భారత్ మరింత మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపిఎల్లో ఆడిన అనుభవం భారత ఆటగాళ్లకు కలిసి వచ్చే అవకాశం ఉంది. బౌలింగ్లో కూడా భారత బలంగానే ఉంది. బుమ్రా, దీపక్ చాహర్, జడేజా, వాషింగ్టన్ సుందర్ తదితరులు ఐపిఎల్లో అద్భుతంగా రాణించారు. ఈసారి కూడా మెరుగ్గా రాణించాలనే పట్టుదలతో ఉన్నారు.
జోరుమీదున్నారు
ఇక ఆస్ట్రేలియా కూడా సిరీసే లక్షంగా పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే వన్డే సిరీస్ సొంతం చేసుకోవడంతో టి20లలో సమరోత్సాహంతో బరిలోకి దిగుతోంది. ఫించ్, స్మిత్, మాక్స్వెల్ అద్భుత ఫామ్లో ఉన్నారు. వన్డేల్లో ఈ త్రయం అద్భుతంగా రాణించింది. టి20లలో కూడా చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. లబూషేన్, డిఆర్సీ షార్ట్, కేరి, మాథ్యూ వేడ్ తదితరులతో బ్యాటింగ్ బలంగా ఉంది. అంతేగాక కమిన్స్, హాజిల్వుడ్, హెన్రిక్స్, స్టార్క్, అబార్ట్.ఆడమ్ జంపా, స్టోయినిస్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే కనిపిస్తోంది. ఇరు జట్లలోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉండడంతో సిరీస్ నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం.
మధ్యాహ్నం 1.40 గంటల నుంచి సోని నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం
IND vs AUS 1st T20 Match Tomorrow