Friday, April 19, 2024

టీమిండియాలో కరోనా కల్లోలం

- Advertisement -
- Advertisement -

టీమిండియాలో కరోనా కల్లోలం
కృనాల్‌కు పాజిటివ్, రెండో టి20 నేటికి వాయిదా
కొలంబో: భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో కరోనా కల్లోలం సృష్టించింది. టీమిండియా ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యకు కరోనా ఉన్నట్టు తేలింది. దీంతో భారత్‌శ్రీలంక జట్ల మధ్య మంగళవారం జరగాల్సిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌ను వాయిదా వేశారు. ఈ మ్యాచ్‌ను బుధవారం తిరిగి నిర్వహిస్తారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కృనాల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ పరిణామం ఇరు జట్లలో పెను ప్రకంపనలు సృష్టించింది. సిరీస్ కఠినమైన ఆంక్షల మధ్య నిర్వహిస్తున్నారు. అయినా కృనాల్‌కు కరోనా సోకడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఇరు జట్ల ఆటగాళ్లందరూ బయో బడుగలోనే ఉన్నప్పటికీ కృనాల్‌కు కరోనా ఎలా సోకిందనేది ఎవరికి అంతుబట్టకుండా మారింది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండగా కృనాల్‌కు కరోనా నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది. ఇక ఇతర క్రికెటర్లకు కూడా ఆర్‌టి పిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో వారికి కరోనా లేనట్టు తేలితే బుధవారం తిరిగి మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఇక గురువారం మూడో టి20 షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుంది. అయితే దీనిపై బుధవారం ఉదయం ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ప్రకంపనలు సృష్టించింది..
మరోవైపు కృనాల్ పాండ్యకు కరోనా ఉన్నట్టు తేలడంతో భారత క్రికెటర్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కృనాల్‌తో సన్నిహితంగా ఉన్న ఆటగాళ్లందరూ స్వయ నిర్బంధంలోకి వెళ్లి పోయారు. ఇదిలావుంటే కృనాల్‌కు కరోనా సోకడంతో సూర్యకుమార్ యాదవ్, పృథ్వీషాలు ఇంగ్లండ్‌కు వెళ్లడం క్లిష్టంగా మారింది. వీరద్దరూ చివరి టి20 ముగిసిన వెంటనే ఇంగ్లండ్ వెళ్లాల్సి ఉంది. అయితే సహచర ఆటగాడికి కరోనా పాజిటివ్ బయట పడడంతో వీరిద్దరూ ఇంగ్లండ్ వెళ్లడం కష్టంగా మారింది. నిబంధనల ప్రకారం వీరిద్దరూ కొన్ని రోజులపాటు కఠినమైన ఐసోలేషన్ ఉండక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని ఇంగ్లండ్ పర్యటనకు పంపించే సాహసం బిసిసిఐ చేస్తుందా అనేది సందేహమే.
నేడు మ్యాచ్ రీషెడ్యూల్
కరోనా వల్ల వాయిదా పడిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌ను బుధవారం నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా రెండో టి20కి ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. అయితే భారత క్రికెటర్ పాజిటివ్‌కు గురికావడంతో జట్టు ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది సందేహంగా తయారైంది. ఇక శ్రీలంకకు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. సిరీస్‌ను సమం చేయాలంటే ఇందులో తప్పక గెలవల్సిందే. ఒకవేళ ఓడితే మాత్రం మరో మ్యాచ్ మిగిలివుండగానే సిరీస్‌ను కోల్పోక తప్పదు.

IND vs SL 2nd T20 postponed after Krunal test positive

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News