అమెరికాకు 25 రోజులు,స్పెయిన్కు 30 రోజులు
ప్రపంచ దేశాలతో పోలిస్తే మరణాల రేటూ తక్కువే
ప్రతి లక్ష జనాభాకు 0.2 మందే
న్యూఢిల్లీ: భారత్లో మంగళవారం నాటికి కరోనా కేసుల సంఖ్య లక్ష దాటేసిన విషయం తెలిసింది. లక్షకు పైగా కేసులు ఇప్పటివరకు 11 దేశాల్లో నమోదైనాయి. అయితే వంద కేసులనుంచి లక్ష కేసులు నమోదు కావడానికి భారత్కు 64 రోజులు పట్టింది. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికా, స్పెయిన్లకన్నా లక్ష కేసులు నమోదు కావడానికి భారత్కు రెట్టింపు రోజుల సమయం పట్టింది. అమెరికాలో లక్ష కేసులకు చేరడానికి 25 రోజులు పడితే స్పెయిన్లో 30 రోజులు పట్టింది. ఇక మెరుగైన వైద్య సదుపాయాలున్న జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ దేశాల్లో కూడా వైరస్ విజృంభణతో భారత్కన్నా తక్కువ రోజుల్లో లక్ష పాజిటివ్ కేసులు నమోదు చేసుకున్నాయి. జర్మనీలో 35 రోజులు, ఇటలీలో 36రోజులు, ఫ్రాన్స్లో 39 రోజులు పడితే బ్రిటన్లో 42 రోజులు పట్టింది.
మరణాల రేటూ తక్కువే
కాగా కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్నా మరణాల రేటు తక్కువగా ఉండడం ఊరటనిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి లక్ష మంది బాధితుల్లో 4.1 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోతే భారత్లో అది 0.2గా మాత్రమే ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మంగళవారం ఉదయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,139గా ఉండగా, మరణాల సంఖ్య 3,163గా ఉంది. కాగా సోమవారం రికార్డు స్థాయిలో 1,08,233 శాంపిల్సను పరీక్షించినట్లు కూడా ఆ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు 24,25,742 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ప్రపంచ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 3,11,847 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి లక్ష జనాభాకు 4.1 మరణాలు సంభవించినట్లు లెక్క. కాగా అత్యధికంగా అమెరికాలో 87,180 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అంటే ప్రతి లక్ష జనాభాకు 26.6 మరణాలు సంభవించాయి.
34,636 మరణాలు సంభవించిన బ్రిటన్లో ప్రతి లక్ష మందికి 52.1 మరణాలు నమోదైనాయి. ఇక ఇటలీలో 31,908 మంది చనిపోగా, ప్రతి లక్షమందికి 52.8మరణాలు నమోదూనాయి. ఫ్రాన్స్లో 28,059 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా, ప్రతి లక్ష జనాభాకు 41.9 మరణాలు నమోదైనాయి. స్పెయిన్లో 27,650 మరణాలు సంభవించగా, ప్రతి లక్ష జనాభాకు 59.2 మరణాలు నమోదైనాయి. ఇక జర్మనీలో 9.6, ఇరాన్లో 8.5, కెనడాలో 15.4, నెదర్లాండ్స్లో 33.0 ,మెక్సికోలో 4.0 చొప్పున ప్రతి లక్ష జనాభాకు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే కరోనా వైరస్కు పుట్టినిల్లయిన చైనాలో ఇప్పటివరకు 4,645 మంది చనిపోగా, ప్రతి లక్ష మందికి అక్కడ మరణాల రేటు 0.4గా ఉంది. సకాలంలో కేసులను గుర్తించడంలో ఆప్పత్రిలో చికిత్స అందించడమే మరణాల రేటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక పరీక్షల విషయానికి వస్తే జనవరిలో దేశంలో ఒకే ఒక లేబరేటరీ ఉండగా ఇప్పుడు గణనీయంగా పెరిగి 385 ప్రభుత్వ లేబరేటరీలు,158 ప్రైవేట్ ల్యాబ్ల స్థాయికి చేరుకున్నామని ఆ శాఖ తెలిపింది.