న్యూఢిల్లీ : క్రీడల్లో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన రాజీవ్గాంధీ ఖేల్ రత్న పురస్కారం కోసం భారత మహిళా హాకీ కెప్టెన్ రాణి రాంపాల్ పేరును భారత హాకీ సమాఖ్య ప్రతిపాదించింది. ఇటీవల కాలంలో భారత జట్టు సాధిస్తున్న విజయాల్లో రాణి కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. పలు మ్యాచుల్లో భారత్కు ఒంటి చేత్తో విజయం సాధించి పెట్టిన ఘనత రాణికి దక్కుతోంది. అంతర్జాతీయ మహిళా హాకీలో రాణి అత్యుత్తమ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. సారధిగా, క్రీడాకారిణిగా భారత్ విజయాల్లో తనదైన పాత్ర పోషిస్తోంది. రాణి సేవలకు గుర్తింపుగా ఆమె పేరును ప్రతిష్టాత్మకమైన అవార్డు కోసం ప్రతిపాదించాలని భార త హాకీ నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు రాణి రాంపాల్ పేరును ప్రతిపాదించింది. అంతేగాక వందన కటారియా, హర్మన్ప్రీత్ సింగ్, మోనికా పేర్లను అర్జున పురస్కారాల కోసం సిఫార్సు చేసింది. పురుషుల హాకీలో హర్మన్ప్రీత్ సింగ్, మహిళల హాకీలో వందన, మోనికా మెరుగైన ఆటను కనబరుస్తున్నారు. దీంతో పాటు హాకీ దిగ్గజాలు ఆర్పీ సింగ్, తుషార్ ఖండేకర్ పేర్లను ప్రతిష్టాత్మకమైన మేజర్ ధ్యాన్చంద్ జీవితకాల సాఫల్య పురస్కారాల కోసం హాకీ సమాఖ్య ప్రతిపాదించింది. ద్రోణాచార్య అవార్డు కోసం కోచ్లు బిజె కురియప్ప, రమేశ్ పఠానియా పేర్లను నామినేట్ చేసింది.
Rani Rampal Nominated for Khel Ratna