Friday, April 26, 2024

49 లక్షలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

49 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 83,809 పాజిటివ్ కేసులు,1,054 మరణాలు
మొత్తం మరణాలు 80,776, మొత్తం కేసుల్లో సగం మూడు రాష్ట్రాల్లోనే
78.28 శాతానికి పెరిగిన రికవరీ రేటు

India corona cases crosses 49 lakhs mark

న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు రోజులతో పోలిస్తే రోజువారీ కేసుల సంఖ్య కాస్త తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,72,645 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 83,809 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 49,30,236కు చేరుకుంది. వీరిలో ఇప్పటివరకు 38,59,399 మంది కోలుకుని డిశ్చార్జి కాగా మరో 9 లక్షల90 వేల యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా దేశంలో మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 1,054 మంది కరోనాతో పోరాడుతూ మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 80,776కు చేరుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఆగస్టు 7న 20 లక్షలను దాటగా, ఆగస్టు 23న 30 లక్షలకు, సెప్టెంబర్ 5న 40 లక్షలకు చేరుకుంది. బుధవారం నాటికి ఈ సంఖ్య 50 లక్షలకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే కొవిడ్ 19తో మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలున్న వారేనని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేస్తోంది. దేశంలో ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 78.28 శాతానికి చేరుకోవడం కాస్త ఊరట కలిగిస్తోంది.

గత కొన్ని రోజులుగా దేశంలో కోలుకుంటున్న కరోనా రోగుల సంఖ్య భారీగా ఉంటోంది. సోమవారం సైతం దేశవ్యాప్తంగా 79,292 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. అయితే మరణాల రేటు మాత్రం 1.64 శాతంగా కొనసాగుతోంది. ఇదిలా ఉండగా దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో దాదాపు సగం కేసులు మూడు రాష్ట్రాల్లోనే మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలోనే ఉండగా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, చత్తీస్‌గఢ్, ఒడిశా, కేరళ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో 24.4 శాతం యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లోనే దేశంలోని మొత్తం కేసుల్లో 60.35 శాతం కేసులు ఉండగా, ఈ రాష్ట్రాలనుంచే మొత్తం రికవరీల్లో దాదాపు 60శాతం నమోదవుతున్నాయని ఆ శాఖ వివరించింది. అలాగే ఇప్పటివరకు సంభవించిన మొత్తం మరణాల్లో 37 శాతానికి పైగా అంటే 29,894 మరణాలు ఒక్క మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. కాగా తాజాగా సంభవించిన మరణాల్లో సైతం అత్యధికంగా 363 మరణాలు ఈ రాష్ట్రంలోనే వెలుగు చూశాయి. కాగా దేశంలో ఆక్సిజన్ సిలిండర్లకు ఎలాంటి కొరతా లేదని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ విలేఖరులకు చెప్పారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5 కోట్ల83 లక్షల శాంపిళ్లకు కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసిఎంఆర్) వెల్లడించింది.
అమెరికాలో సగానికి తగ్గిన రోజువారీ కేసులు
ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్19 ప్రభావం అధికంగా ఉన్న అమెరికాలో దీని ఉధృతి కొనసాగుతూనే ఉంది. అయితే జూలై నెలలో నిత్యం 70 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య 35 వేలకు తగ్గింది. అమెరికా వ్యాప్తంగా కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా 7 రాష్ట్రాల్లో మాత్రం అధికంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇక కరోనా మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, బ్రెజిల్, భారత్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

India corona cases crosses 49 lakhs mark

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News