80 ఏళ్లలో వడగాడ్పులు, పెనువరదలు n సౌదీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి n గ్రీన్హౌజ్ కట్టడి కాకపోతే పెను విషాదాలే!
న్యూఢిల్లీ : వచ్చే 80 సంవత్సరాలలో భారతదేశం విపరీత వాతావరణ సమస్యలు ఎదుర్కొంటుంది. జనజీవితంలో అనేక ఆటుపోట్లు ఎదురవుతాయి. సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్అజీజ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మన్సౌర్ అల్మాజ్రోయి సారధ్యంలో జరిగిన అధ్యయనంలో ఈ చేదు నిజం తేలింది. ప్రాణాంతక వడగాడ్పు లు, తీవ్రస్థాయి వరదలు ముంచుకొస్తాయని అధ్యయనంలో వెల్లడైంది. ఈ విధంగా భారతదేశానికి 80 ఏండ్ల దశలో పర్యావరణమే సవాలు అవుతుందని తెలిపారు. దేశ జనాభాకు పలు అనుబంధ సమస్యలు తలెత్తుతాయ ని, పర్యావరణ వలయం దెబ్బతింటుందని, మొత్తం మీద ఆర్థిక వ్యవస్థకు విఘాతం ఏర్పడుతుందని విశ్లేషించారు. కార్బన్ ఉద్గారాల వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రీన్హౌజ్ గ్యాస్ల అత్యధిక స్థాయి వ్యాప్తి క్రమం లో వార్షికంగా భారతదేశం అంతటా కనిష్ట ఉష్ణోగ్రతలు 4.2 డిగ్రీల సెల్సియస్ పెరుగుతాయి. 21వ శతాబ్దం చివరినాటికి ఈ పరిణామం చోటుచేసుకుంటుంది. అబ్దుల్అజీజ్ వర్శిటీ పరిశోధక బృందం పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని అధ్యయనం నిర్వహించింది.
జనసాంద్రత…పర్యావరణ చైతన్యలేమి
ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో భారతదేశంలో జనసాంద్రత ఉంది. అంతేకాకుండా తీవ్రస్థాయి సున్నిత త్వం, పర్యావరణ మార్పులపై పట్టింపులు లేకపోవడం వంటి కారణాలతో సమస్య తీవ్రతరం కానుందని హెచ్చరించారు. ఇంకా సశేషంగా ఉన్న ఈ 21వ శతాబ్దంలో చోటుచేసుకునే మార్పులు అత్యంత కీలకం అవుతాయ ని, వీటి ప్రభావానికి ప్రజలు గురవుతారని అల్మాజ్రోయి శుక్రవారం ప్రపంచపర్యావరణ దినోత్సవం నేపథ్యంలో పిటిఐకి ఇచ్చిన ఇంటర్వూలో తెలిపారు. ఈ పరిణామా న్ని అరికట్టే చర్యలకు దిగకపోతే భారతదేశంలో అత్యధిక జనాభా పలు విధాలుగా చిక్కుల్లో పడుతుందని వివరించారు. దీని ప్రభావం చివరికి ఆర్థిక వ్యవస్థపై పడుతుందని తెలిపారు. ఈ పరిశోధక బృందం అధ్యయనం గత నెలలో ఎర్త్ సిస్టమ్స్ జర్నల్లో ప్రచురితం అయింది.
ఈశాన్య భారతానికి ఎక్కువ ముప్పు
ఈశాన్య భారతదేశంలో వాతావరణ వైపరీత్యాల పరిణామం ఎక్కువగా ఉంటుంది. అక్కడ మంచు కరగడంతో వరదలు రావడం, హిమపాతాలు వంటివి జరుగుతుంది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్ది ఈ పరిణామం తలెత్తుందని దీనితో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని హెచ్చరించారు. ఇప్పటి అంచనాల ప్రకారం చూస్తే ఈ ప్రాంతంలో 6 డిగ్రీల సెల్సియస్ను మించి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఇది మనిషి ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అత్యంత సంక్లిష్టమైన కరాకోరం , హిమాలయ పర్వత శ్రేణువులు నెలవై ఉన్న ఈ ప్రాంతానికి పెను ముప్పు పొంచి ఉందని విశ్లేషించారు. మంచు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో అత్యధిక స్థాయిలో ఇవి కరగడం చివరికి ఆకస్మిక వరదలకు దారితీస్తుందని, ప్రాణనష్టానికి వీలుందని తెలిపారు. పంటలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు.
వడగాడ్పులతో దడ
మైదాన ప్రాంతాలలో అత్యధిక స్థాయిలో వేడిగాలులు వీస్తాయని, ఇది మనిషికి ప్రాణాంతకం అవుతుందని అధ్యయనంలో తెలిపారు. ఇప్పటి విషవాయువుల మోతాదు క్రమాన్ని బట్టి చూస్తే పరిసర వాతావరణంలో విషమ పరిస్థితులు చివరికి వార్షిక సగటు వర్షపాతం అత్యధికంగా పెరిగేందుకు దారితీస్తుందని తెలిపారు. ప్రపంచస్థాయి వాతావరణ నమూనాలను పరిశోధకులు అత్యంత సామర్థపు సూపర్కంప్యూటర్ సాయంతో చేపట్టారు. విపరీత పరిణామాల నేపథ్యంలో భారత ఉపఖండంలో వేసవిలో కంటే శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనితో పంటల జీవవైవిధ్యం దెబ్బతింటుందని, శీతాకాల పంటలకు ముప్పు వాటిల్లుతుందని తెలిపారు. వాయవ్య భారతంలోని గుజరాత్, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో వర్షపాతం పెరుగుతుందని , శీతాకాలంలో కూడా భారీ స్థాయిలో వర్షాలు పడటంతో గుజరాత్ పరిసర ప్రాంతాలకు ముప్పు ఏర్పడుతుందని అధ్యయనంలో విశ్లేషించారు.