లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు
దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు
నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు
విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా, చైనా దేశాల మధ్య విభేధాలు పెరగడం, ఇతర ప్రతికూల అంశాలు భారత్కు కలిసివస్తున్నాయి. ఇదే అదను గా భారత్ కూడా చైనా నుంచి బయటివచ్చే కంపెనీలకు గాలం వేస్తోంది. చైనా నుంచి వచ్చే సంస్థలకు పెద్ద మొత్తంలో భూమిని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యురోపియన్ కంట్రీ లక్సెంబర్గ్కు రెట్టింపు స్థాయిలో భూమిని కేటాయించేందుకు భారతదేశ ప్రభుత్వం పను లు వేగవంతం చేసిందని ఈ అంశానికి చెందినవారి కొందరు వెల్లడించారు. దీని కోసం దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతాన్ని గుర్తించినట్టు సమాచారం. దీనిలో 1,15,131 హెక్టార్లు గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోని ఇండస్ట్రియల్ ల్యాండ్లు ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ప్రకారం, లక్సెంబర్గ్ 2,43,000 హెక్టార్ల విస్తీర్ణం కలిగివుంటుంది.
భారత్లో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న కంపెనీలకు భూమి కేటాయింపు అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. సౌదీ ఆరామ్కో నుంచి పోస్కో వరకు పలు విదేశీ కంపెనీలకు భారత్లో భూకేటాయింపుల సమస్యలతో పెట్టుబడులు ఆలస్యమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, విదేశీ పెట్టుబడిదారులకు సానుకూల విధానాలు చేపట్టేలా ఏర్పాటు చేస్తోంది. కరోనా వైరస్ సంక్షోభం అనంతరం చైనాపై ఆధారపడడం తగ్గించేందుకు ఇన్వెస్టర్ల దృష్టి కోణంలో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సొంతంగా భూమిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ కొన్ని కేసుల్లో ప్రాజెక్టు ఆలస్యానికి దారితీస్తోంది.
చిన్న భూయజమానులతో బేరాలు వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. భూమి కేటాయించిన తర్వాత వాటికి నీరు, రోడ్డు ఉంటేనే కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించే వీలు ఉంటుంది. ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి మందగించిన భారత్కు కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడం అత్యంత ప్రధానం కానుంది. లాక్డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పనులు ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకోవాలని పెద్దఎత్తున పెట్టుబడులు రావాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రస్తుత పరిణామాలను భారత్ సరిగ్గా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
India land offers twice size to firms leaving China