ఆన్లైన్ సదస్సులో ప్రధాని
న్యూఢిల్లీ: దేశంలో రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. శరవేగంగా ఇక్కడనే రక్షణ ఉత్పత్తుల క్రమాన్ని బలోపేతం చేసుకోవల్సి ఉందని స్పష్టం చేశారు. రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపుల పటిష్ట అమలుకు ఏర్పాటు అయిన ఆన్లైన్ సదస్సును ఉద్ధేశించి ప్రధాని సోమవారం మాట్లాడారు. రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి ఇండియా శ్రమిస్తోందని, ఇందులో ప్రధానంగా సంబంధిత రక్షణ ఉత్పత్తుల తయారీ పూర్తిగా స్వదేశీ కావల్సి ఉంటుందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు వందలాది ఆయధ ఫ్యాక్టరీలు ఉండేవి. దీనితో దేశం నుంచి భారీ స్థాయిలో ఇతర దేశాలకు అప్పటి అవసరాలు తీర్చే పలు స్థాయిల ఆయుధ సామాగ్రి ఎగుమతి అయ్యేదని ప్రధాని గుర్తు చేశారు. రెండు ప్రపంచ యుద్ధాల దశలో కూడా భారతదేశం రక్షణ ఉత్పత్తుల పంపిణీ దేశంగా పేరు తెచ్చుకుంది.
అయితే తరువాతి కాలంలో ఈ వ్యవస్థ పటిష్టం కాకుండా పోయిందని తెలిపారు. అయితే తమ ప్రభుత్వం ఈ లోపాన్ని గుర్తించి సర్దుబాటు చర్యలు చేపట్టిందని, పలు వరస క్రమపు చర్యలు తీసుకున్నామని వాటి గురించి ప్రధాని వివరించారు. ప్రభుత్వం పట్టుదలతో వ్యవహరించడం వల్ల రక్షణ రంగ స్వయం సమృద్ధి దిశలో ముందుకు వెళ్లుతున్నామని తెలిపారు. ప్రపంచంలోనే భారతదేశం అతి పెద్ద ఆయుధ రక్షణ ఉత్పత్తుల దిగుమతి దేశాలలో ఒకటి కావడం చింతించాల్సిన విషయమే అన్నారు. మనం అంగారకుడు వద్దకు వెళ్లే వైజ్ఞానిక పటిష్టతను సంతరించుకుంటున్నామని, అయితే ఇదే తరుణంలో ఇతర దేశాల నుంచి ఆయుధాలను తెప్పించుకునే తేలిక పాటి పద్ధతి ఒకటి అలవాటు అయిందన్నారు. ఈ పద్ధతి నుంచి తాము దూరం అయ్యామని, పరిస్థితిని చక్కదిద్ది, శీఘ్రగతిన ఆయుధ ఉత్పత్తుల ప్రమాణికత, పరిణాత్మకతలను ఇనుమడింపచేసేందుకు పాటుపడుతున్నామని తెలిపారు.