Friday, April 19, 2024

60ఏళ్ల జల జగడం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సింధూ జలాల ఒప్పందంపై పొరుగుదేశం పాకిస్థాన్‌కు భారతదేశం నోటీసు వెలువరించింది. 1960 సెప్టెంబర్ 19 నాటి ఈ పురాతన కీలక ఒప్పందా న్ని అమలు చేయడంలో పాకిస్థాన్ నిరాసక్తతకు నిరసనగా ఈ శ్రీముఖం పంపించారు. ఇండస్ వాటర్ ట్రీటీ (ఐడబ్లుటి)ని సవరించుకుని కొత్తగా రూపొందించుకుందామని ప్రతిపాదించింది. ఇరు దేశాల మధ్య పారే నదీ సంబంధించి అత్యంత కీలకమైన ఈ అం శంపై నోటీసును వెలువరించినట్లు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఈ నెల 25వ తేదీననే ఈ నోటీసును పాకిస్థాన్ ప్రభుత్వానికి పంపించారు. సింధూ జలాల సంబంధిత కమిషనర్ల ద్వారా ఈ నోటీసులను పంపారు. ఇంతకాలం అయింది ఒప్పందం అమలు చేయకుండా తాత్సారం చేస్తూ పోతున్నారు. మరి, ఈ క్రమంలో ఒప్పందాన్ని తిరిగి కుదుర్చుకుంటే మంచిదని భారత ప్రభుత్వం సూచించింది.

తొమ్మిదేళ్ల పాటు సంప్రదింపుల తరువాత ఇరు దేశాల మధ్య దశాబ్ధాల క్రితం ఈ నదీజలాల ఒప్పందం కుదిరింది. ఒప్పందం అమలులో జగమొండి వైఖరితో విసిగిపోయి ఇప్పుడు భారత ప్రభుత్వం సంబంధిత వర్గాల ద్వారా నోటీసును పంపించినట్లు వెల్లడైంది. అప్పటి ఈ ఒప్పందానికి ప్రపంచ బ్యాంక్ కూడా సాక్షి సంతకధారిగా ఉంది. సీమాంతర నదుల పంపిణీ క్రమంలో ఇరుదేశాల జలాల వాటాలకు సంబంధించి సరైన పంపిణీ, సమాచార వినిమయం గురించి సరైన పనిచేసే వ్యవస్థను ఖరారు చేసుకునేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఆశించారు. అయితే అసలు ఉద్ధేశం ఏళ్లు గడిచినా నెరవేరకపోవడం ఇప్పటి నోటీసుకు దారితీసింది. పాకిస్థాన్ ఇక నైనా 90 రోజులలో అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు ముందుకు వచ్చేందుకు వీలు కల్పించడం జరుగుతుంది.

ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిన క్రమాన్ని సవరించుకునేందుకు ఈ విధంగా సమయం ఇవ్వడం జరుగుతుందని నోటీసుల్లో తెలిపారు. 62 సంవత్సరాలలో నేర్చుకున్న పలు రకాల గుణపాఠాలకు అనుగుణంగా సరికొత్తగా సింధూ ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. భారతదేశం ఎల్లవేళలా ఈ ఒప్పందం సరైన రీతిలో అమలు చేసేందుకు ముందుకు వచ్చిందని , బాధ్యతాయుత భాగస్వామిగా నిలిచిందని గుర్తు చేశారు. నిబంధనల మేరకు ఒప్పందం అమలు జరిగితే ఇరుపక్షాలు ప్రయోజనం పొందుతాయని భారతదేశం భావిస్తూ వచ్చింది. సరైన స్పందనతో స్ఫూర్తిదాయకంగానే ఈ జల ఒప్పందం అమలుకు తమ పక్షం సిద్ధం అయిందని, కానీ ఇందుకు విరుద్ధంగా పొరుగుదేశం వ్యవహరించడం వల్ల రెండు విషయాలు తెలుస్తున్నాయి. ఒక్కటి ఆ దేశానికి ఈ ఒప్పందం పట్ల సదభిప్రాయం లేదు , లేదా దీనిని సవరించుకుని నూతన ఒప్పందానికి వెళ్లాలనుకుఉంటోంది.

ఇందుకు కూడా తాము సిద్ధం అని పేర్కొంటూ ఈ క్రమంలోనే ఇప్పుడు నోటీసును పంపిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ నిరాసక్తత, నిష్క్రియాలేమితనానికి ప్రతిచర్యగానే ఇప్పుడు తాము స్పందించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కిషెన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి పాకిస్థాన్ సాంకేతిక అభ్యంతరాలను లేవనెత్తింది. 2015లో వీటికి సంబంధించి పరిశీలనకు తటస్థ సాంకేతిక నిపుణుల నియామకానికి డిమాండ్ చేసింది. ఆ తరువాత కూడా దీనిపై మాటమార్చింది. కోర్టు ఆఫ్ అర్బిట్రేషన్ జోక్యాన్ని కోరింది.

నెహ్రూ ఆయూబ్ ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందం ఇది

భారత ఉపఖండ విభజన క్రమంలో తలెత్తిన పలు వివాదాస్పద అంశాల నేపథ్యంలో 1960లో ఇరుదేశాల మధ్య సింధూ ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అప్పటి అధ్యక్షులూ ఆయూబ్‌ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందానికి ప్రపంచబ్యాంక్ పర్యవేక్షక బాధ్యత కూడా తీసుకుంది. ఇరు దేశాల సరిహద్దుల మధ్య సాగే నదులు బియాస్, రావి, సట్లేజ్ వంటి తూర్పు వైపు సాగే నదులకు భారతదేశానికి ఆధిపత్యం లభించింది. కాగా పశ్చిమ దిక్కుకు ప్రవహించే సింధు, చినాబ్, జిహ్లమ్ నదుల జలాలకు సంబంధించి కంట్రోలును పాకిస్థాన్‌కు కల్పించారు.

ఈ విధంగా సింధూ జలాల వ్యవస్థకు సంబంధించి భారత్‌కు 20 శాతం జలాల వినియోగానికి, పాకిస్థాన్‌కు 80 శాతం వాటా పొందేందుకు వీలేర్పడింది. కాగా పశ్చిమ దిశకు సాగే నదులకు సంబంధించిన నీటిలో పరిమిత నీటిని భారతదేశం తమ నిత్యావసరం కాని వినియోగాలకు అంటే జల విద్యుత్ ప్రాజెక్టులకు, నావిగేషన్‌కు, ఫ్లోటింగ్‌కు, చేపల పెంపకాలకు వంటివాటికి వినియోగించుకునేందుకు వీలుంది. పశ్చిమ నదుల వెంబడి ఇండియా జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ఈ ఒప్పందంలో పలు విధాలుగా సవివరణాత్మక మార్గదర్శకాలు ఇమిడి ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News