Thursday, April 25, 2024

కేంద్రం రైతులను చావు దెబ్బ కొట్టింది: రాహుల్ గాంధీ

- Advertisement -
- Advertisement -

కాల్‌పేట్ట(కేరళ): వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వివరాలేవీ రైతులకు తెలియదని, వాటి గురించి తెలిస్తే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన జరిగి ఉండేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులపై కొట్టిన తాజా చావు దెబ్బగా ఆయన అభివర్ణించారు. తన సొంత నియోజకవర్గం వాయనాడ్‌లో పర్యటన జరుపుతున్న రాహుల్ గాంధీ రెండవరోజు గురువారం కాల్‌పేట్టలో యుడిఎఫ్ సమావేశంలో ప్రసంగిస్తూ, ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలలో సిబిఐ, ఇడి వంటి కేంద్ర ఏజెన్సీలను విస్తృతంగా ఉపయోగిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వంపై మాత్రం అటువంటి ఒత్తిడి ఏదీ చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో సిబిఐ, ఇడి కేసుల విషయంలో చాలా ఉదాసీనంగా ఉన్నారని ఆయన అన్నారు. సిబిఐ దాడులు కాంగ్రెస్ లేదా సిపిఎంపై ఎక్కువగా జరుగుతున్నాయో వార్తాపత్రికలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుందని రాహుల్ చెప్పారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వంపై బిజెపి మెతక వైఖరిని అవలంబిస్తోందని పరోక్షంగా చెబుతూ ప్రధాని నరేంద్ర మోడీ కేరళ ముఖ్యమంత్రి కన్నా కాంగ్రెస్ నాయకత్వంపైనే ఎక్కువ విమర్శలు గుప్తిస్తుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
నూతన వ్యవసాయ చట్టాలపై తన విమర్శల దాడిని కొనసాగిస్తూ దేశంలోని వ్యవసాయ వ్యవస్థను ముగ్గురు నలుగురు బడా వ్యాపారులకు అప్పచెప్పడమే కేంద్ర ప్రభుత్వ మౌలిక ఆలోచనని రాహుల్ ఆరోపించారు. ఐదు నుంచి పది మంది వ్యాపారులు ప్రతి రైతు ఉత్పత్తిని చౌర్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలోని ప్రతి కార్మికుడు, రైతు, మండీ కూలీ, ట్రక్కు డ్రైవర్ నుంచి ఈ వ్యాపారులు చోరీ చేస్తున్నారని, ఈ దోపిడీకి ప్రధాని నాయకత్వం వహిస్తున్నాడని రాహుల్ ఆరోపించారు. ఇది కేవలం రైతులపై జరుగుతున్న నేరమే కాదని, దేశంపై జరుగుతున్న నేరమని ఆయన అన్నారు. కేరళలో కాంగ్రెస్ సారథ్యంలోని యుడిఎఫ్ అధికారంలోకి వస్తే వాయనాడ్ నియోజకవర్గంలో వైద్య కళాశాల ఏర్పాడు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

India will fire If all farmers understood farm laws: Rahul Gandhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News