Tuesday, April 23, 2024

యువ భారత్‌దే ఆసియా కప్

- Advertisement -
- Advertisement -

India wins Asia Cup Under-19 cricket tournament

 

ఢాకా: ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ అండర్19 క్రికెట్ టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో శ్రీలంకను ఓడించింది. వర్షం వల్ల మ్యాచ్‌కు పలు మార్లు అంతరాయం కలిగింది. దీంతో డిఎల్‌ఎస్ పద్ధతిలో ఫలితాన్ని నిర్ధారించారు. ఇందులో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. వర్షం వల్ల మ్యాచ్‌ను 38 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. అయితే మరోసారి వర్షం రావడంతో భారత్ లక్ష్యాన్ని 102 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 21.3 ఓవర్లలోనే కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ అంగరీష్ రఘువంశీ, షేక్ రషీద్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రఘువంశీ ఏడు ఫోర్లతో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

ఇక సమన్వయంతో బ్యాటింగ్ చేసిన రషీదద్ రెండు ఫోర్లతో 31 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. దీంతో భారత్ అలవోక విజయంతో ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. విక్కీ 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కుశాల్ తాంబే రెండు వికెట్లు తీశాడు. ఇక రాజ్‌వర్ధన్, రవికుమార్, రాజ్ బావా తదితరులు పొదుపుగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక స్కోరు 106 పరుగుల వద్దే ఆగిపోయింది. రొడ్రిగో 19 (నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News