ముంబై: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరిపై జరుగుతున్న పోరాటానికి తనవంతు సహాయంగా భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) భారీ విరాళాన్ని ప్రకటించింది. పిఎం కేర్ సహాయ నిధికి బిసిసిఐ తరఫున 51 కోట్ల భారీ విరాళాన్ని అందించింది. కరోనాపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తనవంతు సహాయంగా ఈ మొత్తాన్ని అందిస్తున్నట్టు బిసిసిఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహాయం అందజేయాలని బిసిసిఐ కోరింది. కరోనా కట్టడికి ఈ నిధులను ఖర్చు చేయాలని కోరింది. ఈ మేరకు పిఎం కేర్స్కు బిసిసిఐ ఈ భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. ఇక, బిసిసిఐ సహాయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. క్లిష్ట సమయంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసి బిసిసిఐ పెద్ద మనసు చాటుకుందని ప్రశంసించారు.
రైనా విరాళం రూ.51 లక్షలు
మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా కూడా కరోనా బాధితుల సహాయం కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. పిఎం కేర్స్కు సురేశ్ రైనా రూ.51 లక్షలు విరాళం అందించాడు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించాలని కోరాడు. ఇప్పటి వరకు టీమిండియా క్రికెటర్లలో రైనాదే అతి పెద్ద విరాళం కావడం విశేషం.