Friday, April 19, 2024

శాస్త్ర పరిశోధనపై నిర్లక్ష్యం!

- Advertisement -
- Advertisement -

గత రెండు వారాలుగా దేశంలో అనేక అంశాలు ముందుకు వచ్చాయి. ప్రధానమైన వాటిలో చైనా వస్తువులను బహిష్కరించాలి వారికి బుద్ధి చెప్పి మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి అని తెచ్చిపెట్టుకొని వీరంగం వేయటం ఒకటి. అది వీధుల్లో సద్దుమణిగినా సామాజిక మాధ్యమాల్లో కొనసాగుతోంది. రెండవది చైనాకు దీటుగా మనం ఎందుకు అభివృద్ధి కాలేకపోయాము, ఏం చేయాలి అని అనేక మంది నిజాయితీతో మదనపడటం.అసలైన దేశభక్తి వీరిదే. తోలుబొమ్మలాటలో పాత్రధారుల వంటి మొదటి తరగతి సరిహద్దు సమస్య సద్దుమణగ్గానే సామాజిక మాధ్యమాల్లో కూడా కనుచూపు మేరలో కనపడదు. మోడీ సర్కార్‌కు ఇబ్బందులు తలెత్తినపుడు తిరిగి రంగంలోకి వస్తుంది. డోక్లాం సమస్య తలెత్తినపుడు మూడు సంవత్సరాల క్రితం ఈ బాపతే చైనా వ్యతిరేక శివాలును ప్రదర్శించటాన్ని ఇక్కడ గుర్తు చేయాలి.
ఎందరో మేధావులు మన దేశంలో ఉద్భవిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. వారి పరిజ్ఞానం మన కంటే విదేశీ కార్పొరేట్లకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఆంగ్లం చదువుకున్న మేధావులు కూడా తమకు తెలియని వేదాల్లో ఎంతో సాంకేతిక పరిజ్ఞానం ఉందని నమ్మే దౌర్భాగ్య వైపరీత్యం ఒక వైపు ఉంది. చివరికి ఓం శబ్దం గురించి అమెరికా నాసా చెప్పిందంటే తప్ప నమ్మని జనం కూడా తయారయ్యారు. మరోవైపు గత ఏడు దశాబ్దాలలో పరిశోధన అభివృద్ధికి తగిన ప్రాధాన్యత, నిధులు కేటాయింపుల్లేని స్ధితి మరొకటి. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన తప్పిదాలన్నింటినీ ఐదేండ్లలో పరిష్కరించామని చెప్పుకుంటున్న సంఘ్ పరివార్ నేతలు ఈ విషయంలో కాంగ్రెస్ చెప్పుల్లోనే కాళ్లు దూర్చారు. ఇతర దేశాలతో పోటీ పడేందుకు అవసరమైన నిధులు కేటాయించకుండా అరకొర నిధులలో కొన్నింటిని ఆవు మూత్రం, పేడలో బంగారం, ఇంకా ఏముందో పరిశోధించేందుకు మళ్లిస్తున్నారు. వాటిలో ఏముందో ఒక నోటితో వారే చెబుతారు, మరో నోటితో పరిశోధనలు చేయాలంటారు? మరి కొందరు తెలివి తేటలు గల పిల్లల్ని ఎలా పుట్టించాలా అని పరిశోధిస్తున్నవారు కూడా లేకపోలేదు. ఇవన్నీ ఉట్టితో పనిలేదు, ఏకంగా స్వర్గానికి తీసుకుపోతామని జనానికి సందేశమివ్వటమే !
మన దేశంలో శాస్త్రీయ పరిశోధనలకు అనేక సంస్ధలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పాలకులు వాటికి తగినన్ని నిధులు కేటాయించేందుకు శ్రద్ధ తీసుకోలేదు. కొన్ని రంగాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడున్న సర్కార్ గత ఆరు సంవత్సరాలలో అంతకు మించి చేసిందేమీ లేకపోగా శాస్త్రవేత్తలను కించపరచటం, శాస్త్ర పరిజ్ఞానాన్ని తక్కువ చేసి మాట్లాడటం జరుగుతోంది. దీనికి కారణం ఏమంటే సమాజంలో శాస్త్రీయ భావాల వ్యాప్తి పెరిగితే మత, తిరోగామి శక్తుల అజెండా అమలుకు ఆటంకంగా మారతాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం జపాన్ 3.1, చైనా 2.1 శాతాల చొప్పున తమ జిడిపిలో పరిశోధనాభివృద్ధికి ఖర్చు చేస్తున్నాయి. మన దేశం 0.7 శాతం మాత్రమే, అదీ కొన్ని సంవత్సరాలుగా ఎదుగుబొదుగూ లేకుండా ఉందంటే అతిశయోక్తి కాదు. దీనిలో కూడా సింహభాగం అణుశక్తి, అంతరిక్షం, రక్షణ వంటి కీలక రంగాలలోనే వెచ్చిస్తున్నారు.
మన ప్రయివేటు రంగం రాయితీల మీద చూపుతున్న శ్రద్ధ పరిశోధనపై పెట్టడం లేదు. అతి పెద్ద కార్పొరేట్ సంస్ధ రిలయన్స్ ఇండస్ట్రీస్ 2016లో తన అమ్మకాల ఆదాయంలో కేవలం అర శాతమే పరిశోధనకు ఖర్చు చేసింది. ఔషధ, ఐటి రంగాలలో చేస్తున్న ఖర్చు మిగతా వాటితో పోలిస్తే ఎక్కువే అయినా విదేశాల్లోని సంస్థలతో పోలిస్తే తక్కువే. అమెరికా, ఐరోపాలోని ఔషధ కంపెనీలు తమ అమ్మకాల ఆదాయంలో 20 శాతం వరకు ఖర్చు చేస్తుండగా ఒకటీ అరా తప్ప భారతీయ కంపెనీలు పది శాతానికి మించి కేటాయించటం లేదు. ఐటి రంగంలో తక్కువ వేతనాలు చెల్లించి ఎగుమతులతో ఆ రంగం పని చేస్తుండగా జనరిక్ ఔషధాల ఎగుమతులతో ఫార్మా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మన మార్కెట్లో స్వదేశీ వస్తువులకు కల్పిస్తున్న రక్షణల కారణంగా మన కార్పొరేట్‌లు ఎలాంటి నవీకరణ లేకుండా తమ వస్తువులను అమ్ముకొనేందుకు అలవాటుపడ్డాయి. ఇది ఎంతవరకు పోయిందంటే ఎక్కడో తయారయ్యే వాటిని తెచ్చి అమ్ముకుంటే వచ్చే లాభాలు మెరుగ్గా ఉన్నపుడు మనం తయారు చేయటం ఎందుకు అనేంతగా! అమెరికా, ఐరోపా దేశాలు మనకు మార్గదర్శకంగా ఉన్నాయి, కనుకనే ఏటేటా చైనా వస్తువుల దిగుమతి జరుగుతోంది. ఎగుమతి మార్కెట్లలో నిలవాలంటే నవప్రవర్తక ఉత్పత్తులు కావాలి, అందుకోసం పరిశోధన అభివృద్ధి ఖర్చు చేయాలి. మన ఎగుమతులు గత పది సంవత్సరాలుగా 2,50,300 డాలర్ల మధ్య ఉంటున్నాయి తప్ప మెరుగుపడటం లేదు. ప్రపంచ వస్తు ఎగుమతుల్లో మన వాటా 1.7 శాతం మాత్రమే. ఐటి గురించి ఘనంగా చెప్పుకోవటమే తప్ప మూడున్నర శాతం మాత్రమే మన ఎగుమతులు ఉన్నాయి. నూట ముఫ్పై అయిదు కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో వైద్యం ఎంతో ముఖ్యమైనది. ఈ రంగంలో ఎంతో పరిశోధన జరగాల్సి ఉందని కోవిడ్ 19 నిరూపించింది. ఈ రంగంలో పరిశోధనా సంస్ధగా ఉన్న ఐసిఎంఆర్‌కు ఇస్తున్న నిధులెన్ని? 2017, 18 సంవత్సరాలలో పరిశోధనాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేసిన 93 శాతం ఖర్చులో పన్నెండు ప్రధాన పరిశోధనా సంస్ధలు ఉన్నాయి. వాటిలో డిఆర్‌డిఒకు 31.6 శాతం, అంతరిక్షశాఖకు 19, వ్యవసాయ పరిశోధనకు 11.1, అణుఇంధన సంస్ధకు 10.8, సిఎస్‌ఐఆర్ 9.5శాతం పొందగా ఐసిఎంఆర్‌కు 3.1, భూశాస్త్రాలకు 2.3, ఎలక్ట్రానిక్స్, ఐటికి 0.8, పర్యావరణ, అడవులకు 0.5, రెన్యువబుల్ ఎనర్జీకి 0.1శాతం ఖర్చు చేశారు.
శాస్త్ర, సాంకేతిక శాఖ(డిఎస్‌టి)లో పని చేసిన ప్రతి ఉన్నతాధికారి పరిశోధనాభివృద్ధికి నిధులు పెంచేందుకు ప్రయత్నించినా పాలకులు ప్రాధాన్యత ఇవ్వలేదన్నది పచ్చి నిజం. డబ్బు రూపం లో ఏడాదికేడాది పెరిగినట్లు కనిపించవచ్చు గానీ జిడిపిలో శాతాల వారీగా చూస్తే గత పదేండ్లలో తగ్గింది తప్ప పెరగలేదు. 2009లో నాటి డిఎస్‌టి కార్యదర్శి టి రామస్వామి ఒక పత్రిక ఇంటర్వ్యూలో చెప్పినదాని సారాంశం ఇలా ఉంది. పరిశోధన ఖర్చు జిడిపిలో 0.9 శాతం ఉంది, రెండు శాతానికి పెంచటానికి ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రతి పది లక్షల మంది జనాభాకు మన దేశంలో పూర్తికాలం పని చేసే శాస్త్రవేత్తలు కేవలం 120 మంది కాగా చైనాలో 800, బ్రిటన్‌లో 2,800, అమెరికాలో 3,200 ఉన్నారు. పదేండ్ల తరువాత అదే రామస్వామి చెన్నయ్‌లో ఎంఎస్ స్వామినాధన్ ఫౌండేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 2018లో పరిశోధకులు పది లక్షల జనాభాకు 253 మంది మాత్రమే ఉన్నారని, జిడిపిలో రెండు శాతం కేటాయింపులు లేవని చెప్పారు.
ప్రపంచ బ్యాంకు సమాచారం ప్రకారం చైనాలో 1,225 (2017 సం), కెనడాలో 4,264 (2016), జపాన్ 5,304 (2017) అమెరికాలో 4,245 (2016), బ్రిటన్‌లో 4,341( 2017) ఉన్నారు. బ్రెజిల్‌లో 888 (2014), చివరికి దారిద్య్రం తాండవించే పాకిస్ధాన్‌లో 336 (2016) ఉన్నారు. మిగతా దేశాల అందుకోవాలంటే మనం ఎంతగా ఎదగాలో ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. గత పదిహేను సంవత్సరాలలో మన దేశంలో పరిశోధన ఖర్చు మూడు రెట్లు పెరిగితే అదే చైనాలో పెరుగుదల పది రెట్లు ఉంది. ప్రభుత్వాల వైపు నుంచి ప్రోత్సాహకాలు పెద్దగా లేకపోయినా 2008 17 మధ్య కాలంలో భారతీయులు స్వదేశం విదేశాల్లో పేటెంట్లకు చేసిన దరఖాస్తులు, పొందిన పేటెంట్లు దాదాపు రెట్టింపు కావటం ఒక మంచి సూచిక. మన దేశంలో పరిశోధన, అభివృద్ధికి చేస్తున్న కేటాయింపులు 2012 13లో రూ.73,892 కోట్లు కాగా 2016 17 నాటికి రూ.1,04,864 కోట్లకు పెరిగాయి. జిడిపిలో చూస్తే 0.7 శాతమే. ఇదే ఇజ్రాయెల్ 4.6, దక్షిణ కొరియా 4.5, జపాన్ 3.2, జర్మనీ 3.0, అమెరికా 2.8, ఫ్రాన్స్ 2.2, బ్రిటన్ 1.7, కెనడా 1.6 శాతం చొప్పున ఖర్చు చేస్తున్నాయి. బ్రిక్స్ దేశాలలో చైనా 2.1, బ్రెజిల్ 1.3, రష్యా ఒకశాతం ఖర్చు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ స్వయంగా పార్లమెంటులో చెప్పారు.
నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారానికి వచ్చాక జరిగిన సైన్సు మహాసభలలో అధికార పార్టీ నేతలు చేసిన ఉప న్యాసాలు, చెప్పిన మాలు దేశంలో సైన్సు కంటే నాన్ సైన్స్ లేదా నాన్‌సెన్స్‌ను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. మన పురాతన కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ ఉండేదని, దానికి నిదర్శనం వినాయకుడని ప్రధాని నరేంద్ర మోడీగారే స్వయంగా చెప్పారు. ఇక ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌గా పని చేసిన ఒక పెద్ద మనిషి పురాతనకాలంలో మన దేశంలో విమానాశ్రయాలు, ఫైటర్ జెట్‌లు ఉన్నాయని సెలవిచ్చారు. మరో పెద్ద మనిషి ఐన్‌స్టీన్, న్యూటన్ సిద్ధాంతాలే తప్పన్నాడు. బ్రహ్మకు తెలియంది ఏమీ లేదు, ప్రపంచంలో అందరి కంటే ముందు ఆయనే డైనోసార్లను కనుగొన్నాడు, వేదాల్లో రాశారు అని పంజాబ్ విశ్వవిద్యాలయ జియాలజిస్టు అషు ఖోస్లా చెప్పారు. వేదాలు మూడున్నర లేదా మూడు వేల సంవత్సరాల నాడు రచించినట్లు లేదా అప్పటి నుంచి వల్లెవేస్తున్నట్లు చెబుతారు. ఇంకా పురాతనమైనవని కొందరు చెబుతారు. కానీ డైనోసార్లు ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం అంతరించినట్లు శాస్త్రవేత్తల అంచనా, అంతకు ముందే వేదాలను బ్రహ్మరాశాడా ? నిజానికి వేదాలు, బ్రహ్మ గురించి చెబుతున్నదానికి నమ్మకం తప్ప శాస్త్రీయ ఆధారాలు లేవు. రావణుడు పుష్పక విమానాలను వాడినట్లు చెబుతారు, మరి సర్వం తానే అయిన విష్ణురూపమని చెప్పే రాముడు, మరొకరు వాటిని ఎందుకు వినియోగించలేదు,వానరులతో వారధి ఎందుకు కట్టించాల్సి వచ్చింది అంటే సమాధానం ఉండదు.
ఇక వేద గణితం, వేద భౌతిక శాస్త్రం గురించి, సైన్సు సాధించిన అనేక అంశాను వేదాలు, పురాణాలకు వర్తింప చేస్తూ చెప్పే ఆధునిక విద్యావంతుల గురించి చెప్పాల్సిందేముంది? శాస్త్ర ప్రపంచం ఏ నూతన ఆవిష్కరణ చేసినా వేదాలు, పురాణాల్లో కొన్ని సంస్కృత పదాలను పట్టుకొని వాటి అర్దం అదే అని నిస్సంకోచంగా చెప్పేస్తారు. ఐన్‌స్టీన్, న్యూటన్‌కు భౌతిక శాస్త్రం గురించి పెద్దగా తెలియదని 106వ సైన్సు కాంగ్రెస్‌లో ఒక పెద్ద మనిషి చెబుతుంటే అసలు మీ అర్హత ఏమిటని అడిగే వారే లేకపోయారు. పారిశ్రామిక విప్లవానికి మూలం పరిశోధనాభివృద్ధి అన్నది తెలిసిందే. ఆ సమయంలో మనం ఆ బస్సును ఎందుకు అందుకోలేకపోయాం అన్నది పరిశోధించాల్సిన అంశమే.

                                                                                              ఎం కోటేశ్వరరావు
                                                                                              8331013288

Indian Govt Neglected on scientific researches

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News