Friday, March 29, 2024

సంపాదకీయం: సంక్షోభంలో యువత

- Advertisement -
- Advertisement -

Indian student crisis with online education పూర్తి ఆన్‌లైన్ చదువుల విదేశీ విద్యార్థులను దేశం నుంచి తరిమేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయం అక్కడికి వెళ్లి బాగుపడాలనే భారతీయ విద్యార్థులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుంది. కువైట్‌లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడిన బయటి దేశాలవారి సంఖ్యను గణనీయంగా తగ్గించుకోడానికి అక్కడి ప్రభుత్వం ఒక బిల్లును సిద్ధం చేసింది. అమెరికా నిర్ణయం చదువుల కోసం అక్కడికి వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకొని బాగుపడాలనుకునే మన విద్యార్థులపై పిడుగుపాటు వంటిది. వారు కేవలం ఉన్నత ప్రమాణాల విద్యార్జన కోసమే అక్కడికి వెళుతూ ఉంటే ఆ స్థాయి విద్యను ఇక్కడ కూడా అందించి వారిని మన దేశంలోనే ఉంచుకోవచ్చని సలహా ఇవ్వడం సబబుగానే ఉంటుంది. కాని సంపన్నమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భాగస్వాములై అత్యంత విలువైన డాలర్ కరెన్సీని సంపాదించుకోడం అంతిమ లక్షంగా మన విద్యార్థులు అక్కడికి వెళుతున్నారు. మన ఆర్థిక వ్యవస్థ దానితో పోటీ పడజాలదు.

2019 విద్యా సంవత్సరంలో 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. అక్కడ నాణ్యమైన విద్య లభించడంతో పాటు, చదువుకుంటూనే సంపాదించుకునే తెరువులు, ఆ తర్వాత మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ముఖ్యంగా వైద్యం, ఇంజినీరింగ్ విద్యార్థులకు మంచి భవిష్యత్తు సమకూరుతోంది. అధ్యక్ష ఎన్నికలు అతి చేరువలో ఉన్న తరుణంలో అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాల్లో భాగంగా ట్రంప్ విద్యార్థి వీసాలపై ఈ కొత్త ఆంక్షను సంధించాడు. ఇది తీవ్ర వివాదాస్పద అంశంగా మారింది. దీనిపై న్యాయ స్థానాల్లో కేసులు కూడా దాఖలయ్యాయి. అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులలో చైనీస్ తర్వాత మన వారే ఎక్కువ. గత ఏడాది అమెరికా కళాశాలలలో ప్రవేశం పొందిన వారిలో విదేశీయులు 5.5 శాతం ఉన్నారు. వీరి వల్ల అమెరికాకు లభించిన రాబడి 41 బిలియన్ డాలర్లు. ఉన్నత సాంకేతిక విద్యల్లో పట్టభద్రులై అమెరికా వెళుతున్న విదేశీ విద్యార్థుల వల్ల అక్కడి సంస్థలకు ఉత్తమ ప్రమాణాల మేధస్సు చకవగా లభిస్తున్నది. ఆ దేశ సంపదను పెంచడంలో వీరు గణనీయమైన పాత్ర పోషిస్తున్నారు.

కువైట్ తలపెట్టిన బిల్లు చట్టమైతే అక్కడ స్థిరపడ్డ కనీసం 8 లక్షల మంది భారతీయులు స్వదేశానికి వచ్చేయవలసి వస్తుంది. వీరిలో అత్యధికులు కేరళీయులే. 14 లక్షల 50 వేల మంది భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. కువైట్ జనాభా 43 లక్షలు కాగా, వారిలో 70 శాతం అంటే 30 లక్షల మంది విదేశీయులే. తమది విదేశీయుల దేశం అనే అభిప్రాయాన్ని తొలగించడానికి కువైట్ ఈ కొత్త బిల్లును తలపెట్టింది. దేశీయంగా చూస్తే హర్యానా రాష్ట్రం అక్కడి ప్రైవేటు ఉద్యోగాలలో 75 శాతాన్ని స్థానికులకే కేటాయించడానికి నిర్ణయించింది. పాలక భాగస్వామ్య పక్షమైన జన నాయక్ జనతా పార్టీ (జెజెపి) 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మేరకు వాగ్దానం చేసి 10 స్థానాలను గెలుచుకుంది. మహారాష్ట్రలో స్థానికేతరుల బూచీని చూపించి ముఖ్యంగా దక్షిణాది వారిపై కక్ష కట్టి, ఉద్యమాలు నడిపి శివసేన రాజకీయంగా బాగుపడింది. ఈ విధంగా అమెరికా సహా అనేక చోట్ల బయటి వారి బహిష్కరణ ధోరణి ప్రబలిపోతున్నది. ఇది భారత దేశానికి అతి పెద్ద సవాలుగా మారుతున్నది. మొన్న కరోనా లాక్‌డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళ్లిపోయిన అసంఖ్యాక వలస కార్మికులలో బీహార్, ఉత్తరప్రదేశ్ వారు అత్యధికులు. కాగా స్థానికంగా పనిపాట్లు కరువైన ఇతర రాష్ట్రాల వారూ ఉన్నారు.

తెలంగాణలో ముఖ్యం గా హైదరాబాద్ నగరం వచ్చి పలు రకాల చిన్న, పెద్ద వృత్తులు, పనులు చేసుకొని బతుకుతున్న బయటి రాష్ట్రాల వారు లెక్కలేనంత మంది. అదే సమయంలో స్థానికుల్లో నిరుద్యోగులు, ఆధునిక వృత్తి నైపుణ్యాలు కొరవడినవారు కూడా అసంఖ్యాకంగా ఉన్నారు. దేశంలో ఉన్నత విద్యా ప్రమాణాలు దుర్భిణీ వేసి చూసినా కనపడవు. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా అవతరించినా పరిశ్రమలకు పనికి వచ్చే ఇంజినీర్లు తగిన సంఖ్యలో తయారు కావడం లేదు. అందువల్ల వారిలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఇబ్బడిముబ్బడిగా నెలకొన్న ప్రభుత్వ, ప్రైవేటు పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటిఐ) లు ఒకప్పుడు మెకానికల్, ఎలెక్ట్రిక్స్ మున్నగు సాంకేతిక వృత్తుల్లో యువతకు ప్రాథమిక స్థాయి శిక్షణనిచ్చి స్వతంత్రంగా పని చేసి సంపాదించుకొనే సామర్థాన్ని కలిగించేది. ఇప్పుడవి తమ పూర్వపు ఆకర్షణ కోల్పోయాయి. యువతలో తెల్ల చొక్కా మనస్తత్వం, కుర్చీల్లో కూర్చొని పని చేసే అనాయాస ఉద్యోగాల పట్ల మక్కువ పెరిగిపోయి ఐటిఐలు దెబ్బతిన్నాయి. అందుచేత దేశంలోని యువతకు పని సంస్కృతిని అలవర్చి, దానిని అపారంగా కలుగజేయాలి. ఉచ్ఛ నీచ తేడాలు చూడకుండా శ్రమకు గౌరవమిచ్చి అందుబాటులోని ఏ పనినైనా చేయడానికి సిద్ధపడేలా వారిని మలచాలి. సామాజిక హోదాను బట్టి ఉన్నత ఉద్యోగాలే చేయాలనే దృష్టిని పూర్తిగా తొలగించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News